Amaravati: భూములిస్తాం కానీ...చంద్రబాబుకు అమరావతి రైతుల కండిషన్స్..!
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో మరో విడత అమరావతిలో భూసమీకరణకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియను కూడా సమాంతరంగా కొనసాగిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేస్తోంది. భూసమీరణపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. వారి అనుమానాలు నివృత్తి వచేసి భూముల్ని తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇందులో రైతులు మరో విడత తమ భూముల్ని రాజధాని అవసరాల కోసం ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం రాజధానిలో చేపట్టే నిర్మాణాలు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు వారు తాజాగా పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పేర్కొన్నారు. అయితే ఇందుకు వారు కొన్ని కీలక షరతులు పెడుతున్నారు. వీటికి అంగీకరిస్తే తమ భూములిచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా పెదకూరపాడు నియోజకవర్గంలో దాదాపు 10 వేల ఎకరాల భూసమీకరణ కోసం భూములు ఇచ్చే రైతుల్ని పిలిపించి గ్రామసభ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ముందు కొన్ని షరతులు పెట్టారు. ఇందులో ప్రధానంగా రాజధానికి తాము ఇచ్చే 10 వేల ఎకరాల భూముల్లో ఏయే నిర్మాణాలు చేపడుతున్నారో ముందుగానే చెప్పాలని రైతులు కోరారు. అలాగే ఐటీ కంపెనీల్ని విశాఖకు, పరిశ్రమల్ని తిరుపతి శ్రీసిటీకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని అధికారులకు వారు గుర్తుచేశారు. అటువంటప్పుడు అమరావతిలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో చెప్పాలని కోరారు.
దీంతో పాటు తమ భూములు తీసుకుని బదులుగా ఇచ్చే ప్లాట్లు రైల్వేస్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పువైపున ఉండేలా ఇవ్వాలని పెదకూరపాడు నియోజకవర్గ రైతులు కోరారు. ప్రస్తుతం ఎకరాకు ఏడాదికి 60 వేల కౌలు ఇవ్వాలని, దాన్ని ఏటా 10 శాతం పెంచుకుంటూ పోవాలని కోరారు. వచ్చే నెల నుంచే ఈ కౌలు చెల్లింపులు చేయాలంటున్నారు. ప్రభుత్వ భూములు, ఆలయ భూములు కాకుండా రిజిస్ట్రేషన్ భూముల్లోనే తమకు ప్లాట్లు ఇవ్వాలంటున్నారు. రైల్వే ప్రాజెక్టుకు భూమి తీసుకుంటున్నారు కాబట్టి తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగాలు కావాలని కోరారు.












Click it and Unblock the Notifications