9 రోజుల వేడుకగా రాజధాని శంకుస్థాపన: జపాన్, సింగపూర్ ప్రధానులు రావడం లేదు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. అక్టోబర్ 22న జరిగే జరిగనున్న ఈ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విద్యుద్దీపాలు, టపాసుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.
ఈ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు వంటి అతిరథ మహారథులు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఆ దేశ ప్రధానిని స్వయంగా శంకుస్థాపనకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ ప్రధాని, జపాన్ ప్రధాని హాజరుకావడం లేదని ఇప్పటికే సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో కృష్ణానది ముఖద్వారం ఆనుకుని శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కనీసం లక్షమందికి పైగా ప్రజలు హాజరైతే సరిపోయేలా 50 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని అమరావతి శంకుస్థాపనను రాష్టప్రండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రజలను మమేకం చేస్తూ, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా చేస్తోంది.
అక్టోబర్ 22 నుండి వారం రోజుల పాటు నవరాత్రులు రాజధాని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. శంకుస్థాపన అనంతరం లేజర్ షోలు , ఇతర విద్యుద్దీపాల ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వాహణ బాధ్యతలను ముంబైలోని విజ్క్రాఫ్ట్ వరల్డ్ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకు అప్పగించారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 10 కోట్లు చెల్లిస్తుంది.
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపనకు వచ్చే వీఐపీల కోసం ప్రవేశద్వారాలు, బారికేడ్లు, సౌండ్ సిస్టం, లైటింగ్, జనరేటర్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ముఖ్య అతిథులకు అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర వ్యవహారాలన్నీ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకే అప్పగించారు.
మరో పక్క రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు వీలుగా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్కు అనుమతి ఇచ్చినట్టు కూడా సమాచారం. తొమ్మిది రోజుల పాటు జరిగే ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపన పనులకు కలిపి దాదాపు 50 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ నిధులను ట్రాన్స్కో, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధిశాఖ, అటవీశాఖల నుండి సమీకరిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపనకు అవసరమైన మట్టిని రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని గ్రామాల నుండి సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని గ్రామ ప్రాంతాల ప్రజలు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా మంత్రులు ఇప్పటికే స్థానిక ప్రజలతో చర్చించారు. అందరూ సంయమనంతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేలా ఇప్పటికే శిక్షణ తరగతులు మొదలయ్యాయి.
రాజమండ్రి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో వీవీఐపీలు, వీఐపీలు, అధికారులు, ప్రజలు ఒక క్రమ పద్ధతిలో వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సన్నాహాలు చేస్తున్నారు. వంద మంది వరకూ కూర్చునే విధంగా సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధానితో సహా కేంద్రమంత్రులు గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా సభా స్థలికి చేరుకునేలా ఎస్కార్టులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల నుండి ప్రతినిధులు తమ కలశాలతో మట్టిని తీసుకువస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బౌద్ధమతానికి ఉన్న చారిత్రక మూలాలు ప్రతిబింబించేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.