మంచిపని చేస్తున్నారని బాబుకు సోనియా, విహెచ్ 'సారీ': మెట్రోకు 50 ఎకరాలు
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతి పరిఢవిల్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆకాంక్షించారు. అమరావతి శంకుస్థాపనకు తనను ఆహ్వానించినందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు.
రెండువేల సంవత్సరాలకు ముందు నుంచే అమరావతికి ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది ప్రపంచస్థాయి రాజధానిగా విరాజిల్లాలన్నారు. సోనియా కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. మంచి పని చేస్తున్నందుకు చంద్రబాబుకు అభినందనలు అన్నారు.

చంద్రబాబుకు వీహెచ్ లేఖ
అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వి హన్మంత రావు శుభాకాంక్షలు తెలిపారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావాలన్నారు. దసరా ఉత్సవాల కారణంగా తాను రాలేకపోతున్నట్లు చెప్పారు.
గవర్నర్ నరసింహన్కు ఆహ్వానం
రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ గవర్నర్ నరసింహన్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన అనంతరం ఆదివారం రాత్రి రాజ్భవన్కు చేరుకున్న చంద్రబాబు గవర్నర్కు శాలువా కప్పి, ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ నెల 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అనంతరం దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన గవర్నర్కు వివరించారు. అమరావతికి తప్పక వస్తానని నరసింహన్ చంద్రబాబుకు తెలిపారు.
ఏపీ రాజధాని మెట్రోకు 50 ఎకరాలు
అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టు (ఏఎంఆర్సీ) పనులను వేగంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు అడ్డంకులను ఒక్కోటి అధిగమిస్తోంది. ఏఎంఆర్సీ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిచ్చినపుడు కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులు పూర్తిచేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
దాదాపు 26 కి.మీ.దూరంలో రెండు కారిడార్లు అమరావతి మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అనుమతిచ్చింది. తొలి కారిడార్ (12.76కి.మీ)లో పండిట్ నెహ్రూ బస్ టెర్మినల్ నుంచి పెనమలూరు, రెండో కారిడార్ (13.27కి.మీ)లో పండిట్ నెహ్రూ టెర్మినల్ నుంచి నిడమానూరు వరకు మార్గం నిర్మించనుంది.
ప్రాజెక్టు కోసం 50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అవసరమైన భూమిని గుర్తించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పరిశీలించింది. గుర్తింపు ప్రక్రియ వేగం చేయాలని, 50 ఎకరాలు సిద్ధం చేసి ఏఎంఆర్సీకి అప్పగించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ను సర్కారు ఆదేశించింది.












Click it and Unblock the Notifications