అమరావతి నిధుల మళ్లింపు: చంద్రబాబుపై ప్రభుత్వంపై మోడీ ప్రభుత్వం గుర్రు
విజయవాడ: నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. భారీ అర్థిక లోటు, సంక్షేమ పథకాలు అమలు ఎపి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా పరిణమించాయి. ప్రాధాన్య రంగాలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర రంగాలకు మళ్లించినట్లు తెలుస్తోంది.
దానిపై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఓ ప్రముఖ దినపత్రికలో శనివారం వార్తాకథనం రావడం సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో సమన్వయంతో ముందడుగు వేయాలని భావిస్తున్న స్థితిలో ఈ వార్తాకథనం రావడమే ఈ సంచలనానికి కారణం.
తాము ఏ అవసరాల నిమిత్తం నిధులు ఇచ్చామో, వాటిని అందుకే ఖర్చు చేశారా, లేదా అని తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగ పత్రాలు పంపించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. అప్పుడే కొత్తగా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఎపి ప్రభుత్వం ఆందోళనకరమైన పరిస్థితిలో పడింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు దశల్లో మొత్తం రూ.1850 కోట్లు ఇ్చచింది. మొదట విడుదల చేసిన రూ.1000 కోట్లు రాజధానిలో సౌకర్యాల కోసం, మిగిలిన 500 కోట్లను రాజభవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి ఖర్చు చేయాలని సూచించింది. వాటితో పాటు రాజధాని అవసరాల కోసం మూడు నెలల క్రితం మరో రూ.350 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
అయితే, ఆ మొత్తంలో ఏ మాత్రం రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయలేదు. రాజధాని నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఖర్చు చేసింది. తర్వాత వెసులుబాటును బట్టి ఆ నిధులను రాజధాని నిర్మాణానికి వెచ్చిస్తామని ఎపి ప్రభుత్వం అంటోంది.