క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు- అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు-నారాయణకు ఉచ్చు ?
ఏపీలో రాజధాని అమరావతి ప్రకటన, నిర్మాణం నేపథ్యంలో చోటు చేసుకుందని చెబుతున్న భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని వైసీపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఓ ప్రకటన చేశారు. అయితే ఈ స్కాంపై రెండేళ్లుగా విచారణ జరిపిన సీఐడీ ఏం పురోగతి సాదించిందనే విషయంలో ప్రభుత్వం పెద్దలు కానీ, అధికారులు కానీ నోరు మెదపడం లేదు. దీంతో తాజాగా అసైన్డ్ భూములపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ దర్యాప్తు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రకటనతో పాటు నిర్మాణం సందర్భఁగా తమకు అనుకూలంగా ఉన్న వారికి పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టారంటూ గత కొన్నేళ్లుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అమరావతి భూముల స్కాంగా చెబుతున్న ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ రెండేళ్లలో సీఐడీ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్ లో పనిచేసిన మంత్రులు, అధికారులు, స్ధానిక రైతులపై కేసులు నమోదు చేసింది. వీటిని సవాల్ చేస్తూ వారు కోర్టుల్ని ఆశ్రయించారు. అయితే ఈ కేసులన్నీ ప్రధానంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ చుట్టూ తిరుగుతున్నవే. కానీ ఏపీ హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణను తిరస్కరించడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అసైన్డ్ భూముల మార్పిడి వివాదాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. దాంతోనే ఈ దర్యాప్తు ముగించాలని భావిస్తోంది.

ఫిర్యాదుకు ముందుకు రాని రైతులు
అమరావతిలో భూముల స్కాం దర్యాప్తులో సీఐడీ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా భూముల మార్పిడి వ్యవహారం చుట్టూనే దర్యాప్తు చేరుకున్న నేపథ్యంలో రైతుల నుంచి ఫిర్యాదులు లభిస్తే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన సీఐడీ... వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే బయటపెట్టిన అంశాలతోనే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వీటిపైనా రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదుల్లేవు. పైపెచ్చు రాజధానిలో భూముల్ని తాము స్వచ్చందంగానే అమ్ముకున్నామని, తద్వారా పిల్లలకు చదువులు చెప్పించగలిగామని, పెళ్లిళ్లు చేశామంటూ రైతులు బహిరంగంగానే చెప్తున్నారు. దీంతో రైతుల్ని ఈ స్కాంలో కనీసం సాక్ష్యులుగా కూడా వాడుకోలేని పరిస్ధితి సీఐడీకి ఎదురవుతోంది.

మాజీ మంత్రి నారాయణకు బిగుస్తున్న ఉచ్చు ?
అమరావతి భూముల్ని రాజధాని ప్రకటనకు ముందే అసైన్డ్ రైతుల నుంచి కారుచౌకగా కొట్టేసిన వ్యవహారంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణను నిందితుడిగా చూపేందుకు వైసీపీ సర్కార్ కు ఓ అవకాశం లభించింది. తాజాగా ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన వీడియోలో రియల్టర్లు రైతుల నుంచి భూముల స్వాధీనం కోసం చేశారని చెబుతున్న కుట్రలో మాజీ మంత్రి నారాయణ పాత్ర తెరపైకి వచ్చింది. అప్పటి మున్సిపల్ మంత్రిగా నారాయణ ఈ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని చక్కబెట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణలపై ఇప్పుడు సీఐడీ దృష్టిసారిస్తోంది. ఇందులో నారాయణ పాత్ర రుజువైతే అమరావతి స్కాంలో ఓ పెద్ద తలకాయ చిక్కినట్లవుతుంది.
Recommended Video

కొండను తవ్వి.. ఎలుకను పట్టి...
అమరావతి భూముల స్కాంలో వైసీపీ ప్రభుత్వం సీఐడీ సాయంతో రెండేళ్లుగా సాగిస్తున్న దర్యాప్తులో చంద్రబాబు, లోకేష్ తో పాటు పలువురు మాజీ మంత్రుల పేర్లను తెరపైకి తెచ్చింది. జీవోలు జారీ చేయడం దగ్గరి నుంచి భూముల మార్పిడి వరకూ పలు అంశాల్లో వీరి పాత్ర ఉందనే ఆరోపణలను వైసీపీ పదే పదే తెరపైకి తెచ్చింది. కానీ వాటిని నిరూపించడంలో మాత్రం విఫలమైంది. తాజాగా తెరపైకి తెచ్చిన అసైన్డ్ భూముల వ్యపహారంలో ఆరోపణలు నిర్ధారణ అయినా మాజీ మంత్రి నారాయణ మినహా ఇతర టీడీపీ నేతల్ని దోషులుగా చూపడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో అమరావతి దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిపోబోతోంది.












Click it and Unblock the Notifications