అమరావతి ఉద్యమానికి 700 రోజులు: ఆంక్షలు,అణచివేతలతో రైతుల పోరాటం ఆపలేదు; జగన్ నిర్ణయం మారలేదు!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రాజధాని కోసం పంటలు పండే భూములను త్యాగం చేశామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం తాము త్యాగం చేస్తే జగన్ సర్కార్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, ఏపీ రాజధాని అమరావతి నగరమే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.

700 రోజులుగా ఉద్యమం చేస్తున్నా అమరావతి రైతుల పోరాటానికి జగన్ నో రెస్పాన్స్
అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు విభిన్న రీతిలో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ అణచివేతకు పాల్పడుతుందే తప్ప, రాజధాని అమరావతి రైతుల గోడు విన్న దాఖలాలు లేవు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని, ఈ నిర్ణయం మార్చుకునేది లేదని జగన్ సర్కార్ తేల్చిచెప్పింది.
రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు, కోర్టులో పిటిషన్లు వెరసి ఏపీ రాజధాని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రతిబంధకాలు; అయోమయంలో ఏపీ రాజధాని
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పినప్పటికీ కోర్టుల్లో కేసులు నడుస్తున్న కారణంగా, మూడు రాజధానులు ఏర్పాటు సాధ్యం కాలేదు. జగన్ నాలుగడుగులు ముందుకు వేయాలని ప్రయత్నిస్తే, కోర్టు కేసులతో పదడుగులు వెనక్కు పడుతున్న పరిస్థితి ఉంది. అటు మూడు రాజధానులు ఏర్పాటు కాక, ఇటు ఏపీ రాజధాని అమరావతినా కాదా అన్నది అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉంటే మొదట ఉధృతంగా సాగిన అమరావతి రైతుల ఉద్యమం, తర్వాతి కాలంలో పట్టించుకునే నాథుడు లేక వెలవెలబోయింది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా రైతులు ఆందోళన చేసినప్పటికీ, మహమ్మారి కారణంగా రాజధాని రైతుల ఆందోళనలు పట్టించుకున్న వారు లేరు.

కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర ... 700రోజులు కావటంతో కార్యక్రమాలు
ప్రస్తుతం మరోమారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాజధాని అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజధానిగా అమరావతి కొనసాగాలన్న నిర్ణయాన్ని వివిధ జిల్లాల ప్రజల్లోకి తీసుకువెళ్లి, వారందరి మద్దతును కూడగట్టి ఉద్యమాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రైతులు సాగిస్తున్న మహాపాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది .16వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజు అమరావతి ఉద్యమం మొదలై 700 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

700రోజులుగా అమరావతి ఉద్యమం ... నేడు ప్రత్యేక కార్యక్రమాలివే
సర్వమత ప్రార్థనలు నిర్వహించి, రాజధాని అమరావతి కోసం అమరులైన వారికి నివాళులర్పించారు. అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ, మహిళల ప్రత్యేక మాలధారణ, ఎస్సీ మైనారిటీల అమరావతి సంకల్పం, అమరావతి ఉద్యమం గీతాలాపన, ఉద్యమ కాలంలో ముఖ్యమైన ఘట్టాలను గుర్తు చేసుకుంటూ చర్చించనున్నారు. ఇంతకాలంగా అమరావతి పోరాటం సాగుతున్నా పట్టించుకోని జగన్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమరావతిలో వెలుగులు నింపేందుకు అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ సర్కారు కళ్లు తెరవాలని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని, సేవ్ అమరావతి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అప్పటి వరకు తమ ఆందోళన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

రాజధాని అమరావతి పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి మహా పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. అమరావతి మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని 70 గ్రామాల మీదుగా జరగనుంది. డిసెంబర్ 15వ తేదీన తిరుపతిలో యాత్ర ముగియనుంది. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులను ఆది నుండీ అణచివేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. అమరావతి ఉద్యమం పెయిడ్ ఆర్టిస్ట్ ల ఉద్యమం అని, చంద్రబాబు బినామీల ఉద్యమం అని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉద్యమం అని వైసీపీ నేతలు రాజధాని ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నేటికీ రాజధాని విషయంలో అధికార వైసీపీ తీరు అలాగే ఉంది.

రాజధాని కోసం ప్రతిపక్షాల మద్దతు, లాఠీ దెబ్బలు తిన్న రైతులు
వైసీపీ మినహాయించి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి తమ వంతు మద్దతు తెలిపారు. కచ్చితంగా అమరావతి రైతులు విజయం సాధిస్తారని తేల్చి చెప్తున్నారు. న్యాయం గెలుస్తుందని చెప్తున్నారు. పాలకులు మారితే రాజధానులు మారవని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు ఆంక్షలు పెడుతూ, ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని నిలువరించే అనేక ప్రయత్నాలు చేశారు. రాజధాని రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు. పోలీసు స్టేషన్ లకు వెళ్లారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీఆర్డీఏ రద్దు ను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రకాశం జిల్లాలో పదవ రోజు కొనసాగుతోంది. మొదటి ఆరు రోజులు గుంటూరు జిల్లాలో కొనసాగిన పాదయాత్ర, గత పది రోజులుగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అమరావతి రైతులు సాగిస్తున్న మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుండి సంఘీభావం లభిస్తోంది. పాదయాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా అనేకమంది అమరావతి రైతుల పోరాటానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పోలీసులు మాత్రం అడుగడుగునా ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై ప్రస్తుతం కోర్టులు సీరియస్ గా దృష్టి సారిస్తున్న నేపధ్యంలో ఏపీ రాజధాని రగడ ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications