తిరుపతిలో అమరావతి సభ- చంద్రబాబు, నారాయణ, రఘురామ-రాజధాని మారదని భరోసా
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానుల ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాదాపు రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులు తాజాగా తిరుపతి వరకూ పాదయాత్ర కూడా నిర్వహించారు. దీని ముగింపు సందర్భంగా తిరుపతిలో ఇవాళ అమరావతి పరికక్షణ మహోద్యమ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో వైసీపీ మినహా మిగతా విపక్షాలన్నీ హాజరయ్యాయి. అమరావతినే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశాయి.
తిరుపతిలో అమరావతి సభ
తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రారంభమైంది. అమరావతి నుంచి తరలివచ్చిన రైతులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విపక్ష పార్టీల కార్యకర్తలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సభ ప్రారంభమైన తర్వాత అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి వచ్చిన రైతులు, మహిళలు తమ ఇబ్బందుల్ని పంచుకున్నారు. అమరావతి కోసం రెండేళ్లుగా తాము చేస్తున్న పోరాటంతో పాటు పాదయాత్రలో ఎదుర్కొన్న సమస్యల్ని ఏకరువు పెట్టారు.
చంద్రబాబు, నారాయణ, రఘురామ హాజరు
ఏపీలో విపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ జాతీయ నేత నారాయణ, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు హాజరయ్యారు. దీంతో భారీగా సందడి నెలకొంది. వీరితో పాటు సినీ నటుడు శివాజీ, అమరావతి ఐకాస నేతలు, శివస్వామి సహా పలువురు తరలివచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన నేతలంతా ఒక్కొక్కరిగా అమరావతి రాజధానిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
రఘురామ కామెంట్స్
అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు ముందుగా ధన్యవాదాలు తెలిపిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వారు పడుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు. వీరి త్యాగం ముందు ఎవరి త్యాగం అయినా దిగదుడుపేనన్నారు. అమరావతిలో ఉన్న హైకోర్టుపై ఉన్న నమ్మకమే రాజధానిని అక్కడ ఉంచుతుందన్నారు.
పార్లమెంటులో వెలిగొండ ప్రాజెక్టుపై చిన్న పదం తేడా వస్తే మళ్లీ చట్టం చేయాలన్నారని రఘరామ గుర్తుచేశారు. అమరావతిపై చేసిన చట్టాన్ని మార్చడం ఎవరి వల్లా కాదన్నారు. అంతకాలం ఓపిక పట్టారు, మరికొన్నాళ్లు ఓపిక పట్టాలని రఘురామ కోరారు.