అమరావతిలో మోదీ..షా..పవన్ ఫ్లెక్సీలతో: ఆందోళన ఉధృతం: ప్రభుత్వానికి వ్యతిరేకంగా..!
అమరావతిలో స్థానికులు..రైతులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యమంత్రి మూడు రాజధానుల వ్యాఖ్యల పైన నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. జీఎన్ రావు కమిటీ నివేదికతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసారు. సచివాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. రోడ్ల పైన ఉన్న సీఎం ఫ్లెక్సీలను చించేసారు. దున్నపోతు పాలన అంటూ దున్నపోతుకు పాలు తీస్తూ నిరసన వ్యక్తం చేసారు. అదే సమయంలో దారికి అడ్డంగా ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కట్టి ఆందోళన చేస్తున్నారు. సీడ్ యాక్సిక్ రోడ్డు పైన సిమెంట్ బల్లలు అడ్డంగా పెట్టి..రాకపోకలను అడ్డుకుంటున్నారు. రోడ్ల మీదే కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని అమరావతిలో కొనసాగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
జీఎన్ రావు కమిటీపై రైతుల ఆగ్రహం: అమరావతిలో ఉద్రిక్తత
మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా మందడం రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా, పవన్ కల్యాణ్, బుద్ధుడు ఫోటోలతో కూడా ఫ్లెక్సీలను రైతులు ఏర్పాటు చేశారు. మందడం మెయిన్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలో సైతం బ్యానర్లు వెలిశాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. సీడ్ యాక్సిస రోడ్డు పైన సిమెంట్ బల్లలతో అక్కడ రాకపోకలను అడ్డుకున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కుటుంబ సభ్యులలో కలిసి రోడ్ల మీదే బైఠాయించారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు టైర్లను తగల బెట్టే ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు అడ్డుకొనేందుకు ప్రయత్నం చేయగా..వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రోడ్డు మీదనే పడుకొని నిరసన కొనసాగిస్తున్నారు. వెలగపూడి వద్ద నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సస్ రోడ్డు వద్ద దాదాపు కిలో మీటరు మేర వాహనాలు ఆగిపోయాయి.
దున్నపోతును తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేసారు. ఇది దున్నపోతు ప్రభుత్వం అంటూ నినాదాలు చేసారు. సచివాలయానికి వెళ్లే మార్గం అడ్డుకున్నారు. ఇక, మంగళగిరి మండలంలోని గ్రామాలకు నిరసనలు పాకాయి. అక్కడ పలువురు రైతుల కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చాయి. తుళ్లూరులో మోదీ చిత్రపటానికి వినతి పత్రం అందించి రైతులు నిరసన వ్యక్తం చేసారు. మందడం..తుళ్లూరులో రైతులు రోడ్ల మీద గంటకు పైగా బైఠాయించారు. కురగల్లులోనూ ఆందోళన కొనసాగుతోంది. రహదారులను మూసివేసి.. ప్రభుత్వ తమ నిర్ణయం ఉప సంహరించుకొనే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసారు.