Amaravati : అమరావతిలో మరో ట్విస్ట్-ప్రధాని కోర్టులోకి బంతి ?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి కాకరేపుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఆర్5 జోన్ లో పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు గతంలో న్యాయస్ధానాల్ని ఆశ్రయించిన రైతులు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేంద్రం ఈ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతుల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతిలో రాజకీయం తమకు అనుకూలంగా ఉంటుందో లేదో అన్న అనుమానాల మధ్య వైసీపీ సర్కార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదలకు అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్ధలాలు కేటాయించడంతో పాటు వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అడుగులేస్తోంది.

అటు అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్ధలాల కేటాయింపుతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా న్యాయస్ధానాల్లో మద్దతు లభిస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ కేంద్రానికి కూడా సాయం చేయాలని ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నెల రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో త్వరలో అమరావతి ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని ఆశ్రయించారు.
అమరావతి ఆర్5 జోన్ లో వైసీపీ సర్కార్ చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్ని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి రైతులు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్నారు. అమరావతిపై తుది తీర్పుకు లోబడి ఇక్కడ ఇళ్ల స్ధలాల కేటాయింపు ఉంటుందని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తూ ఇంకా తుది తీర్పు రాకముందే ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. అటు బీజేపీ కూడా అమరావతికి మద్దతిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications