జగన్ ముందు నువ్వెంత లోకేష్.. డేట్ చెప్పు చర్చకు నేనొస్తా.. : అంబటి
ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య హాట్ హాట్ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల కౌంటర్లతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రజల్లోకి వచ్చి గెలిచే దమ్ము లేని లోకేష్ కి జగన్ ను విమర్శించే అర్హత లేదని మండిపడ్దారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమయిందని ఆరోపించిన అంబటి.. రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ కలిసి అందినకాడికి దోచుకుంటున్నారన్నారు.
జగన్ ని చర్చకు పిలిచే ముందు లోకేష్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు అంబటి. ఒకవేళ చర్చకు రావాల్సి వస్తే తాను రావడమో, లేదా ఎవరైనా కార్యకర్తను పంపించడమో జరుగుతుందని అంతే తప్ప లోకేష్ చర్చకు జగన్ రావడమేంటని ఎద్దేవా చేశారు. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో లోకేష్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని.. నిజంగా చర్చకు సిద్దమైతే డేట్, టైమ్ చెప్పాలని సవాల్ విసిరారు.
టీడీపీ అవినీతి పాలనను ఎండగట్టడానికే 'సేవ్ డెమొక్రసీ' పేరిట జగన్ ఢిల్లీ వెళ్ళారని చెప్పిన అంబటి.. చంద్రబాబు ఆస్తుల ప్రకటనను ఓ అబద్దాల పుట్టగా అభివర్ణించారు. టీడీపీ కుట్రలను ఎప్పటికప్పుడు చేధిస్తామని, చర్చకు లోకేష్ 'సై' అంటే ఎన్టీఆర్ భవన్ లో చర్చించడానికైనా తాము రెడీ అని చెప్పారు.