ఇసుక అక్రమాల్లో లోకేష్కూ వాటా, బిజెపి అయ్యింది సిజెపి: అంబటి ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతున్న ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ఏపి సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు కూడా వాటా అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వానికి 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి, ఇసుక ధరను 17 శాతం పెంచిన ప్రభుత్వం.. తీరా చూస్తే ఖజానాకు 500కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతోందని చెప్పారు. ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఏకాభిప్రాయం కావాలని వెంకయ్యనాయుడు మెలిపెట్టడాన్ని అంబటి తప్పుపట్టారు.
రాష్ట్ర విభజన సమయలో ఏకాభిప్రాయం తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం, బిజెపిలు ఉమ్మడిగా విస్మరిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపి కాస్తా సిజెపి(చంద్రబాబు జనతా పార్టీ)గా మారిందని అంబటి ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు దమ్ముంటే ఇసుక మాఫియాపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెడుతున్నారని రాంబాబు మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు బాబు ఈవెంట్ మేనేజర్గా, వెంకయ్య నాయుడు మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.