విపక్ష నేతగా పవన్ ! లోకేష్ ఓడిపోతాడు-అంబటి కామెంట్స్..!
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమిలో పార్టీలు, నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైనా విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో కల్పిత అంకెలతో లేని అభివృద్ధిని చూపుతున్నారని ఆరోపించారు. అప్పులపై తండ్రీకొడుకులవి పచ్చి అబద్దాలన్నారు. మైనింగ్, లిక్కర్ మాఫియాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ విషయంలో మోసం కరెక్ట్ కాదా? అని అంబటి ప్రశ్నించారు.
వైయస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దూషణలు చేస్తున్నారంటూ అంబటి మండిపడ్డారు. జనసేన, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలే అన్నారు. టీడీపీ తండ్రీకొడుకుల పార్టీ అని, జనసేన అన్నదమ్ముల పార్టీ అని అన్నారు.
పవన్ ఎవరిపైనా అయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, దానికి ఎవరైనా బదిలిస్తే మాత్రం తట్టుకోలేరన్నారు. చంద్రబాబు చేసిన నేరాలను ఆ మూడు ఆత్మలే చెబుతాయంటూ అంబటి వ్యాఖ్యానించారు.

ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని, ఇలా మాట్లాడటానికి లోకేష్ ఏ మాత్రం సిగ్గు పడటం లేదని అంబటి ఆక్షేపించారు. మూడు ఆత్మల కథ ఏపీ ప్రజలు ఎప్పుడో విన్నారని, అందులో ఒక ఆత్మ ఎన్టీఆర్ అయితే ఇంకో ఆత్మ నందమూరి హరికృష్ణ, మూడో ఆత్మ లోకేష్ బాబాయ్ నారా రామ్మూర్తినాయుడు అన్నారు. ఈ మూడు ఆత్మలు చంద్రబాబు రాజకీయ జీవితంలో చేసిన నేరాలు, ఘోరాల గురించి తెగ చెప్పాయన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి వైయస్సార్సీపీ కార్యకర్తలకు పనులు చేయొద్దని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వాల్సి ఉందని చట్టాల్లో స్పష్టంగా ఉందని చెబితే, దానికి సమాధానం చెప్పలేక జర్మని వెళ్లాలని పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారన్నాపు. అందుకే ఆయన్ను ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వైయస్ జగన్ అన్నారన్నారు. ఇప్పటికైనా పవన్ ప్రతిపక్ష హోదా తీసుకోవాలన్నారు. వైయస్ జగన్ ఎవరి ప్రాప్తంతోనో సీఎం కాలేదని, ఆయన స్వశక్తితో రాష్ట్రానికి సీఎం అయ్యారన్నారు. ఢిల్లీ కోటను ఢీ కొట్టి ఆయన పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు.
గాలివాటంతో లోకేష్ మొదటిసారి గెలిచాడని, ఇప్పుడెంత మెజారిటీతో గెలిచాడో రాబోయే ఎన్నికల్లో అంతే ఓట్లతో లోకేష్ ఓడిపోవడం ఖాయమన్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక పీడీఎస్ రైస్ దొంగ అని అంబటి ఆరోపించారు. బతుకంతా రేషన్ సీజ్పేరుతో లంచాలు తీసుకోవడమే అన్నారు. బియ్యం దగ్గర కోట్లు లంచాలు తీసుకునే నాదెండ్ల మనోహర్ కి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి లేదన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ సింగిల్ గా వచ్చి తన కెపాసిటీ నిరూపించుకోవాలన్నారు. మూడు పార్టీలు కలిసొస్తే తప్ప ఒక్కడిపై గెలవలేని దుస్థితి ఆయనది అన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాగా బంధుప్రీతికి అతీతం కాదన్నారు. అందుకే పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నా వారందర్నీ పక్కనపెట్టి తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్నారు. ఆ బంధుప్రీతితోనే మొన్నటిదాకా కత్తులు దూసుకున్న తోడళ్లుల్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఇప్పుడు కలిసిపోయారన్నారు. టీడీపీలో తండ్రీకొడుకులు, జనసేనలో అన్నాదమ్ములు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. జమిలి ఎన్నికలు రాకపోతే ఈ దౌర్భాగ్యాన్ని మరో నాలుగేళ్లు భరించాలన్నారు.












Click it and Unblock the Notifications