'బాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ బలి.. కానీ తెలుగు ప్రజలు అలా కాదు'
తెలంగాణ ఉద్యమం, జల్లికట్టు ఆందోళనల తరహాలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారని అంబటి తెలిపారు.
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీఆర్ మరణించారు గానీ ఆయన వెన్నుపోటుకు తెలుగు ప్రజలు మరణించరని అంబటి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా జల్లికట్టును, ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెడుతూ చంద్రబాబుపై అంబటి పలు విమర్శలు చేశారు.
జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి, కేంద్రంతో పోరాడి ఆర్డినెన్స్ సాధించుకున్నారని, కానీ ఏపీ ప్రజల ఊహల్లో కూడా లేని ప్యాకేజీని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మరీ సాధించుకొచ్చారని అంబటి చెప్పారు.
తెలంగాణ ఉద్యమం, జల్లికట్టు ఆందోళనల తరహాలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారని అంబటి తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్రధాన అడ్డంకి టీడీపీనే అని ఈ సందర్బంగా ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ హోదాకు మద్దతు పలకడం ఆనందదాయకమన్నారు.