తప్పు చేస్తే చంద్రబాబైనా అరెస్ట్ .. పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం.. ఎస్ఈసి పరామర్శ దేనికో ? అంబటి ఫైర్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు దేశంపై దాడి జరిగిందంటూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ భ్రమలు కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి సహకరించే మీడియా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు కచ్చితంగా నేరానికి పాల్పడ్డారన్న కారణంగానే అరెస్ట్ చేశారని , సొంత అన్న కుమారుడు పై బెదిరింపులకు దిగితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికార పార్టీకి సవాల్ గా ఏకగ్రీవాలు .. మంత్రులు, ఎమ్మెల్యేల ముందే వైసీపీ గ్రూప్ 'పంచాయితీలు'
తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు అయినా సరే అరెస్ట్
తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు అయినా సరే అరెస్ట్ చేస్తారని, పోలీసుల విధి నిర్వహణ అలాంటిదే అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పోలీసులతో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అంబటి రాంబాబు. అచ్చెన్నాయుడు హోంమంత్రి అయి పోలీసుల తాట తీస్తాడట.. పాపం అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని లా, అచ్చెన్నాయుడు హోం మంత్రి లా, నిమ్మగడ్డ పంచాయతీ మంత్రి లా కలలు కంటున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం అయిందా ?
పట్టాభి పై దాడి విషయంలో కూడా అంబటి రాంబాబు టిడిపి నేతల తీరును తప్పు పట్టారు. గతంలో కూడా పట్టాభి పై దాడి జరిగిందని, ఇప్పుడు కూడా పట్టాభి పై దాడి జరిగిందని , కారు మాత్రమే ధ్వంసమవుతుందా అంటూ ప్రశ్నించారు. దాడి ఎవరిమీద జరిగినా ఖండించాల్సిందేనని పేర్కొన్న అంబటి రాంబాబు టిడిపి నేతలు చిన్న దాడి జరిగితే చంపేస్తారా అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు వెళ్ళిన తర్వాతే పట్టాభి మంచం ఎక్కాడని విమర్శించారు.
గొల్లలగుంటలో ఎస్ఈసి పరామర్శ దేనికోసం
గొల్లలగుంట లో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని ఎన్నికల కమిషనర్ పరామర్శించడం ఏమిటని ప్రశ్నించారు అంబటి రాంబాబు. చంద్రబాబు లోకేష్ నిమ్మగడ్డ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా ? హత్య జరిగిందా అన్న విషయాన్ని దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నారా లోకేష్ కు పైలెట్ గా వెళ్లారా అంటూ ప్రశ్నించారు.
ఈ వాచ్ యాప్ టిడిపి కార్యాలయంలోనే తయారు చేయించి ఉంటారు
ఎన్నికల కమిషనర్ ఆవిష్కరించిన ఈ వాచ్ యాప్ టిడిపి కార్యాలయంలోనే తయారు చేయించి ఉంటారని, టిడిపి వారిని గెలిపించాలన్న తాపత్రయంతోనే చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ యాప్ ను తయారు చేయించారని అంబటి రాంబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడిలా బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని ప్రయత్నం చేస్తే తప్పు గాని, ప్రజలంతా కలిసి ఏకగ్రీవం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించిన అంబటి రాంబాబు ఎన్నికల కమిషనర్ టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ తప్పుల మీద తప్పులు.. మూల్యం చెల్లించాలి
ఎన్నికల కమిషన్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతోంది అని ధ్వజమెత్తిన అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తగిన మూల్యం చెల్లించాలి అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పంచాయతీ ఎన్నికలలో టిడిపికి లబ్ధి చేకూర్చాలని నిమ్మగడ్డ తెగ ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. ఇప్పటికైనా నిమ్మగడ్డ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.