చంద్రబాబు దురదృష్టవశాత్తు సీఎం అయ్యారా?: పదే పదే మేకపాటి నోట ఈమాట
కర్నూలు: నవ్యాంధ్ర నూతన రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ కుంభకోణానికి పాల్పడ్డారంటూ వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ దీక్ష ముగింపు సందర్భంగా కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసిన చంద్రబాబు రాష్ట్రానికి ఎటువంటి హామీ తీసుకురాలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని పేర్కొన్నారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో స్క్వేర్ ఫీట్కు రూ. 3,500లు ఇచ్చి ఎల్అండ్టీతో భవనాలను కట్టిస్తున్నారని ఆరోపించారు.
దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారు: ఎంపీ మేకపాటి
ఏపీకి చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
గతంలో కూడా పలుమార్లు చంద్రబాబు దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ చేస్తున్న పార్టీ ఫిరాయింపులు అనైతికమని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ మరచిపోరని చెప్పారు. పులిచింతల సహా 86 ప్రాజెక్టులను వైయస్ నిర్మించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
టీడీపీ మునిగిపోయే నావ: రాజన్న దొర
టీడీపీ మునిగిపోయే నావ లాంటిదని వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని సర్వేలు చెబుతున్నాయని రాజన్న దొర వెల్లడించారు.
బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పుష్పశ్రీవాణి మాట్లాడుతూ 2004లో మహానేత డాక్టర్ వైయస్ ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారని చెప్పారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేయడానికే పాదయాత్ర చేశారని మండిపడ్డారు.
ప్రజలను నమ్మించి మోసం చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని ఆమె అన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పెన్మత్స సాంబశివరావు, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.