ఇదేనా పాలన, చంద్రబాబు దుబారా బాబు: అంబటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశీ పర్యటనల పేరిట చంద్రబాబు డబ్బును దుబారా చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఒట్టి దుబారా బాబు అన్నారు. సింగపూర్, జపాన్ పర్యటనల కోసం రూ.2.20 కోట్ల నిధులను విడుదల చేయించుకున్నారని ఆరోపించారు. చంద్రన్న కానుక పేరిట పండగ పూట ప్రజలకు నాణ్యత లేని సరుకులు పంపిణీ చేశారన్నారు.
ఎన్నికలలో చందాలు ఇచ్చిన వారికి మేలు చేసేందుకే పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. నీతులు ఎదుటివారికే కానీ తమకు కాదన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. సీఎం అవ్వకముందే పబ్లిసిటీ పేరుతో పత్రికల్లో రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారన్నారు. బాబు పాలన తుగ్లక్ను తలపిస్తోందని, ఇదేనా పాలనా దక్షత అన్నారు.
విమానాల్లో తిరుగుతూ రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పట్టిసీమకు రూ.1300 కోట్లు కేటాయింపులు ఎందుకన్నారు. కాంట్రాక్టర్లను మేపడానికే అని దుయ్యబట్టారు. చంద్రబాబు యోగా పాఠాలు ప్రజల నుండి వచ్చే ఒత్తిడిని నియంత్రించుకోవడానికే అన్నారు.