"లోకేష్.. కాకిపిల్ల, చంద్రబాబు కన్యాశుల్కంలో మధురవాణి"
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. రాష్ట్రాభివృద్దికి తమ పార్టీ అధినేత జగన్ అడ్డుపడుతున్నారంటూ ఆరోపించడం సమంజసం కాదని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు వ్యవహార శైలి కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను తలపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ గురించి ప్రస్తావిస్తూ.. కాకిపిల్ల కాకే అవుతుందని.. కోకిల కాలేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు అంబటి. అధికారం కోసం తాపత్రయపడేది జగన్ కాదని, నారా వంశస్తులకే ఆ యావ ఎక్కువగా ఉంటుందని ఆరోపించారు.
అభివృద్ధికి అడ్డుపడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసిన అంబటి.. టీడీపీ నేతల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా తయారైందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.