మూగ జీవాల ఆరోగ్య రక్షణ కోసం పశువులకు అంబులెన్సులు .. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక మరియు పశువైద్య రంగాన్ని మరింత పటిష్ట పరచడానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో , అంతటి ప్రాధాన్యతను పశువుల సంరక్షణ బాగోగుల పై కూడా పెడుతున్నారు.
అనారోగ్యం బారిన పడిన పశువులను కాపాడటం కోసం ప్రభుత్వం అంబులెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్ లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ డాక్టర్ ల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటుగా రైతు భరోసా కేంద్రాలలో వెటర్నరీ వైద్య సేవలు అనుసంధానం చేయాలని ఈ మేరకు సీఎం జగన్ సూచించారు . 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్ లను ఏర్పాటు చేసి వాటికి వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ తెలిపారు .పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నోరులేని మూగజీవాలను రక్షించడం కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నోరులేని మూగజీవాలను రక్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మొబైల్ అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్ ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) తెలిపింది. పశువైద్య సేవలను ఇంటి వద్దనే అందించడానికి 108 సేవల తరహాలో మొత్తం 175 మొబైల్ అంబులెన్సులు (వెటర్నరీ) క్లినిక్లను అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు.
మొబైల్ అంబులెన్స్ లతో పశువులకు నేరుగా ఇంటి వద్దనే వైద్య సేవలు
ఈ మొబైల్ అంబులెన్సులు స్పాట్ డయాగ్నసిస్ మరియు అత్యవసర కేసులకు హాజరుకావడంతో పాటు పశువైద్య ప్రథమ చికిత్స సేవలను అందిస్తాయి. ఈ అంబులెన్సులు అందించే ప్రధాన సౌకర్యాలలో ఒకటి 'హైడ్రాలిక్ లిఫ్ట్' సౌకర్యం . జంతువులను ఎత్తడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో సమీప ప్రభుత్వ వెటర్నరీ ఫెసిలిటీకి మార్చడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతి అంబులెన్స్కు ఒక పశువైద్య వైద్యుడు, ఒక పారా-వెటర్నరీ కార్మికుడు కేటాయించబడతారు.
అంబులెన్స్లలో 24/7 టోల్ ఫ్రీ కాల్ సౌకర్యం
ఈ అంబులెన్స్లలో 24/7 టోల్ ఫ్రీ కాల్ సౌకర్యం కూడా ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయని, సుమారు 1,376 వెటర్నరీ వైద్యులు పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రికి వివరించింది. మెరుగైన పనితీరు మరియు మెరుగైన చికిత్స కోసం ఎక్కువ మంది పశువైద్య వైద్యులు అవసరమని ముఖ్యమంత్రికి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించారు. వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ ను జూన్ నాటికి సిద్ధం కావాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు . సీడ్, ఫీడ్, మెడికేషన్ వంటివాటిపై ప్రధానంగా దృష్టి సారించాలని , నాణ్యమైన మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.