కష్టకాలంలో అదానీకి అండగా వైసీపీ: నిమిషానికి రూ.2.5 లక్షలు..!!
గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ పై సమగ్ర దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పార్లమెంట్ ను స్థంభింపజేస్తోన్నాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ తప్పు పట్టింది.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన దుమారం.. రోజులు గడుస్తున్నా తగ్గట్లేదు. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. అదాని ఎంటర్ ప్రైజెస్ ఇదివరకు ప్రకటించిన 20,000 కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ను కూడా రద్దు చేయాల్సి పరిస్థితి వచ్చిందంటే- ఈ నివేదిక ఏ స్థాయిలో కుదుపులకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు.
వివరణ ఇచ్చినా..
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికను అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల యాజమాన్యం తోసిపుచ్చింది. అందులో పొందుపరిచిన అంశాలేవీ వాస్తవం కాదని తేల్చి చెప్పింది. తమ నుంచి కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొంది. ఉద్దేశపూరకంగా ఆ నివేదికను రూపొందించిందని ఆరోపించింది. ఆర్థిక మోసాలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. దేశ పారిశ్రామిక పురోగతి, ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసం పని చేస్తోన్నామనీ తెలిపింది.
కొనసాగుతున్నపతనం..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ.. ఆ సంస్థల షేర్ల పతనానికి బ్రేకుల పడట్లేదు. ఇవ్వాళ కూడా అదాని షేర్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లల్లో అదాని ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ ఒక దశలో 1,017 రూపాయలకు క్షీణించింది. ఆ తరువాత కోలుకుంది. 1,300 రూపాయలకు పైగా ట్రేడింగ్ అవుతోంది. ఇప్పటికే అదానీ షేర్ల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ లో డిమాండ్
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నారు. కళ్ల ముందే ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ నిలదీస్తోన్నారు.
తప్పు పడుతున్న వైసీపీ..
ఈ పరిణామాల మధ్య అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య మద్దతు లభించింది. హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను తప్పు పట్టింది. ఆందోళనకు దిగడం, పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపజేయడం సరికాదని తేల్చి చెప్పింది. కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, ఇలాంటి సమయంలో ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకోవడం అర్థరహితమని స్పష్టం చేసింది.
విశ్వసించట్లేదు..
అదాని సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికలను తాము నమ్మట్లేదని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ వీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలపై అర్థవంతమైన చర్చను చేపట్టడానికి ప్రతిపక్ష పార్టీల సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. పార్లమెంట్ సమయం అత్యంత విలువైనదని, నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు వృధా అవుతున్నాయని చెప్పారు.