రఘురామపై సీపీఐ నారాయణ షాకింగ్- సమర్దించలేను- అరెస్టు వెనుక అమిత్షా, కేసీఆర్
ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇవాళ మరోసారి అదే స్దాయిలో వ్యాఖ్యలకు దిగారు. ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అరెస్టు వెనుక కారణాలు, తెలంగాణలో ఈటల రాజేందర్ లక్ష్యంగాసాగుతున్న రాజకీయాలపై నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. విపక్షాలే ఉండొద్దనేలా ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు చేస్తున్న రాజకీయాలపై ఆయన మండిపడ్డారు. రఘురామ, ఈటల లక్ష్యంగా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును, తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీలు చేస్తున్న రాజకీయాలపై నారాయణ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రఘురామ అరెస్టు వెనుక సంచలన కారణాలను ఆయన బయటపెట్టారు. దీంతో ఇప్పుడు నారాయణ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
రఘురామ అరెస్టు వెనుక అమిత్షా, కేసీఆర్ ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం వెనుక ఉన్న కారణాన్ని కూడా సీపీఐ నారాయణ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం లేకుండా ఎంపి రఘురామ అరెస్టు జరిగే అవకాశం లేదన్నారు. రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేయడం, ఇందుకు తెలంగాణ పోలీసులు, సీఆర్పీఎఫ్ అడ్డుకోలేకపోవడాన్ని పరోక్షంగా నారాయణ గుర్తుచేసినట్లయింది.
రఘురామ వ్యాఖ్యలు తప్పే, మరి జగన్ ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదని సీపీఐ నారాయణ తెలిపారు. అయితే చట్టప్రకారం కోర్టు ఆదేశాలు అమలు కాకుండా వ్యవహరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఓ వ్యాక్సిన్ కంపెనీ విషయంలో యజమాని కులం గురించి ప్రస్తావించారని నారాయణ గుర్తు చేశారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సరఫరా విషయంలో సీఎం జగన్, వైసీపీ నేతలు కులం పేరుతో వ్యాఖ్యానించడాన్ని నారాయణ తప్పుబట్టారు.
ప్రతిపక్షం లేకపోతే ప్రజలే రంగంలోకి..
ఏపీలో రఘురామకృష్ణంరాజు అరెస్టు, తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్పై అధికార పార్టీలు కక్షసాధింపులకు దిగుతున్నాయని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్ రఘురామ అరెస్టుకు అనుమతిచ్చి, కింది స్దాయి నేతలు తప్పుబట్టడం కూడా వింతగా ఉందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చూడటం సాధ్యం కాదని, అలాంటి పరిస్దితి వస్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందని నారాయణ వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల్ని హెచ్చరించారు.