జగన్ పై అమిత్ షా ఆరా - నియోజకవర్గాల పెంపు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పైన ఫోకస్ చేస్తోంది. తాజాగా అమిత్ షా కు చంద్రబాబు ఇచ్చిన విందు సమావేశంలో మహిళా రిజర్వేషన్ అమలు.. నియోజకవర్గాల పెంపు అంశం చర్చ కు వచ్చింది. అదే సమయంలో అమిత్ షా మాజీ సీఎం జగన్ గురించి ఆరా తీయటం ఆసక్తి కరంగా మారింది.
జగన్ పై ఆరా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం లో అమిత్ షాకు విందు ఇచ్చారు. ఈ సమయంలో చంద్రబాబుతో అమిత్ షా అనేక అంశాల పైన చర్చించారు. జగన్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసం నుంచి ఇంద్రకీలాద్రి కనిపిస్తుండటం పైన అమిత్ షా ఆసక్తిగా గమనించారు. అదే సమయంలో జగన్ నివాసాలు.. రుషికొండ నిర్మాణం గురించి చర్చకు వచ్చింది. బెంగళూరులో జగన్ నివాసం గురించి లోకేష్ వివరించారు. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అంటూ షా ప్రశ్నించారు. అందుకు బదులుగా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, అప్పుడప్పుడూ వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేశ్ వివరించారు.

సమస్యల ప్రస్తావన
అంతరాష్ట్ర నదీ జలాల సమస్యలు ఉన్నాయా అని అమిత్ షా ప్రశ్నించారు. దీనికి స్పందనగా ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవని.. కానీ, కృష్ణానదికి సంబంధించే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సీఎం వివరించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ కు భారత రత్న గురించి చర్చకు వచ్చిన సమయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నాళ్లు పనిచేశా రని అమిత్షా ఆరా తీశారు. కాంగ్రెస్కు తరుచూ ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉంది కదా అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువకాలం ఎవరు పనిచేశారని అడగ్గా కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం పనిచేయగా ఆ తర్వాత రాజశేఖర్రెడ్డి ఆరేళ్లు సీఎంగా ఉన్నారని చంద్రబాబు బదులిచ్చారు.
నియోజకవర్గాల పెంపు
ఇదే సమయంలో ఎన్డీఏ పార్టీల సమన్వయం.. జమిలి ఎన్నికల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక..మహిళా రిజర్వేషన్ల అమలు.. పార్లమెంట్ స్థానాల పెంపు గురించి చర్చించారు. కాగా, ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225 కి పెంచాల్సి ఉంది. దీంతో..దీని పైన ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల పైన చర్చకు వచ్చిందని.. ఏపీలో తరహాలోనే తెలంగాణలో నూ కూటమి కొనసాగింపు పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కాగా, త్వరలోనే ఢిల్లీలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications