అమిత్ షా సమక్షంలో మరోసారి - ఏపీకి మద్దతు దక్కేనా..!!
ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం ప్రధానితో భేటీ తరువా కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. పెండింగ్ అంశాల పరిష్కారానికి ముందుకొస్తోంది. ఏపీకి కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించింది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఏపీ పునర్విభజన చట్టం అంశాల పైన మరోసారి ప్రస్తావనకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. తిరువనంతపురంలో కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఈ రోజు దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ..తెలంగాణ ప్రభుత్వాలు తమ వాదనలు బలంగా వినిపించేందుకు సిద్దమయ్యారు.
ఏపీ నుంచి కీలక అంశాల ప్రస్తావన
ఏపీ నుంచి ఆర్దిక మంత్రి బుగ్గన నాయకత్వంలో టీం హాజరు కానుంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా పోలవరంకు సవరించిన అంచనాల మేరకు నిధుల కేటాయింపు.. పునరావాస ప్యాకేజీ పైన అమిత్ షాకు నివేదించనున్నారు. అదే విధంగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీని పైన తెలంగాణ ఏకపక్ష నిర్ణయమంటూ విమర్శిస్తోంది. ఈ అంశం పైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల కు నిధులు.. రెవిన్యూ గ్యాప్ భర్తీ వంటి అంశాల పైన ఏపీ ప్రభుత్వం.. ప్రస్తావించేందుకు సిద్దమైంది.
తెలంగాణ వాదనలు సిద్దం
అటు తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బృందం కౌన్సిల్ సమావేశానికి హాజరు కానుంది. సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని రాష్ట్ర బృందాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యుత్ బకాయిలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, విభజన హామీలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి.
తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,700 కోట్లు రావాలని ఏపీ చెపుతుండగా ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ నుంచి తమకు రూ.12 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
దీంతో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం మరోమారు ప్రస్తావనకు రానుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి నీటి పారుదల సంబంధిత అంశాలు సహా విభజన వివాదాలు, సమస్యలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి.
అమిత్ షా సానుకూలంగా స్పందిస్తారా
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కారం గా ఉన్న అంశాలు, దిల్లీలో ఏపీ భవన్ విభజన, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పన్నులో వ్యత్యాసం, పౌర సరఫరాల సంస్థల బకాయిలు సైతం ప్రస్తావనకు రానున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదల సంబంధిత అంశాలు జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
తెలంగాణకు కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశం అజెండాలో ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల నుంచి ప్రస్తావించిన అంశాలు..వాదనల పైన అటు ఏపీ సీఎం జగన్.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచనలు చేసారు. ఈ అంశాల ప్రస్తావన సమయంలో హోం మంత్రి అమిత్ షా స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.