బాబు హ్యాపీ.. ఎమ్మెల్యేలకు టెన్షన్: జగన్తో పొత్తుపై అమిత్ షా ఇలా!
బీజేపీ వైసీపీతో పొత్తుకు సిద్దమవుతోందా? అన్న సంకేతాలు కనిపించాయి. కానీ చంద్రబాబుతో భేటీ సందర్భంగా అమిత్ షా ఓ ఆసక్తికర విషయం చెప్పారట. ఇదే విషయంపై కార్యకర్తలు తనను ప్రశ్నించగా.. కోర్టులో 11చార్జ్ షీట్ల
హైదరాబాద్: రాజకీయ పార్టీలన్ని సర్వేలతోనే పబ్బం గడుపుతున్నట్లు కనిపిస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ అన్న తేడా లేకుండా.. అన్ని రాజకీయ పార్టీలు సర్వే లెక్కల్లోనే తమ భవిష్యత్తును అంచనా వేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలైతే సర్వేల మీద సర్వేలు చేయిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నాయి.
తాజాగా మూడేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న ఎన్డీయే సర్కార్.. తమ పాలన గురించి ఓ సర్వే చేయించిందట. దేశంలో బీజేపీ పట్టు సడలుతోందా? మిత్రపక్షాల పొత్తులు కలిసొస్తున్నాయా? వంటి అంశాలపై సర్వే చేయించారట. ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడతో బీజేపీతో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ వివరాలు వెల్లడించారట.

అమిత్ షా ఏం చెప్పారు:
సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇచ్చిన విందుకు అమిత్ షా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయినట్లు చెబుతున్నారు. భేటీలో తాజా ఎన్డీయే సర్వే గురించి అమిత్ షా.. చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మంచి మద్దతు లభిస్తోందని చెప్పారట. ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఎన్డీయే కూటమి పట్ల ప్రజలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారట.

చంద్రబాబు కష్టపడుతున్నారు:
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారని ఏపీ ప్రజలు భావిస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైందట. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పిన అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారట. ప్రజలంతా టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని సమర్థవంతంగా నడపగలిగేది ఆయన మాత్రమేనని వారు భావిస్తున్నారని గుర్తుచేశారట.

ఎమ్మెల్యేలతోనే చిక్కు:
ప్రజల్లో చంద్రబాబుకు మంచి మార్కులే పడ్డ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు రావచ్చునని అమిత్ షా చంద్రబాబుకు సూచించారట. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారట. ఇప్పటినుంచే వారిని దారిలో పెట్టాలని, లేదంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రతికూల ప్రభావం ఉండవచ్చునని అమిత్ షా పేర్కొన్నారట. అమిత్ షా చెప్పిన విషయాలను చంద్రబాబు ఆసక్తిగా విన్నట్లు చెబుతున్నారు.

జగన్ గురించి ఏమన్నారు?:
విజయవాడలో నిర్వహించిన బీజేపీ సభలో.. 'లీవ్ టీడీపీ.. సేవ్ బీజేపీ' అంటూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా టీడీపీతో పొత్తును వారు వ్యతిరేకిస్తున్నారు. అటు పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నా.. కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు సైతం టీడీపీ గ్రాఫ్ పడిపోతుందన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీతో పొత్తుకు సిద్దమవుతోందా? అన్న సంకేతాలు కనిపించాయి. కానీ చంద్రబాబుతో భేటీ సందర్భంగా అమిత్ షా ఓ ఆసక్తికర విషయం చెప్పారట. ఇదే విషయంపై కార్యకర్తలు తనను ప్రశ్నించగా.. కోర్టులో 11చార్జ్ షీట్లు ఉన్న వ్యక్తితో పొత్తు ఎలా పెట్టుకుంటామని ప్రశ్నించినట్లు తెలిపారట. సొంతంగా గెలవవచ్చునని కొంతమంది బీజేపీ నాయకులు సలహా ఇవ్వగా.. అమిత్ షా పట్టించుకోలేదట.

ఎవరా ఎమ్మెల్యేలు:
టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో.. ఎవరా ఎమ్మెల్యేలు అన్న చర్చ మొదలైంది. పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యవహరిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని అమిత్ షా పేర్కొన్నారంటే.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. మొత్తానికి అమిత్ షా వ్యాఖ్యలు సీఎంకు సంతోషాన్నిచ్చేవిగా ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టేవిగా మారిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications