సైకిల్ పోయిందని పోలీసులకు పదకొండేళ్ళ బాలుడి ఫిర్యాదు: తండ్రికి ఫోన్; షాకైన పోలీసులు
సహజంగా చాలామంది పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడతారు. తమ ఇళ్లల్లో ఏదైనా చోరీ జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కాస్త తటపటాయిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే పోలీసులంటే సమాజంలో చాలా మందికి గౌరవంతో పాటుగా, ఒకింత భయం కూడా ఉంటుంది. అందుకే పోలీసుల వద్దకు వెళ్లాలంటే పెద్దపెద్ద వాళ్ళే జంకుతారు. అలాంటిది పోలీసులంటే భయం లేకుండా, ఎంతో ధైర్యంగా బుడతలు కొందరు ఇటీవల కాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

పెన్సిల్ దొంగతనం అయ్యిందని పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఘటన మర్చిపోకముందే మరోఘటన
మొన్నటికి మొన్న తన పెన్సిల్ పోయిందని, స్కూల్లో తనతోపాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి తన పెన్సిల్ దొంగతనం చేశాడని కేసు పెట్టాలని ఓ పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామంలో హనుమంతు అనే బాలుడు తన పెన్సిల్ తన తోటి విద్యార్థి దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పంచాయితీ పెట్టాడు. ఇక కేసు పెట్టాలని పోలీసులతో ధైర్యంగా చెప్పిన బుడతడికి సర్ది చెప్పేసరికి పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో విద్యార్థి తన సైకిల్ దొంగతనం అయిందని, ఇంటి దగ్గర పెట్టిన సైకిల్ పోయిందని, తన సైకిల్ వెతికి పెట్టాలంటూ ఫిర్యాదు చేశాడు.

సైకిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన పదకొండేళ్ల బాలుడు
ఇటీవల సంక్రాంతి పండుగ సెలవుల కోసం అమ్మమ్మ ఊరికి వెళ్లిన బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పదకొండేళ్ల భువనగిరి సాత్విక్ ఊరి నుండి ఇంటికి వచ్చేసరికి సైకిల్ పోయిందని పోలీసులకు చెప్పాడు . ఆరో తరగతి చదువుతున్న బాలుడు తన సైకిల్ కోసం పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన సైకిల్ పోయిందని , ఊరికి వెళ్లిన తాను తిరిగి వచ్చి చూడగా ఇంటి వద్ద పార్క్ చేసిన సైకిల్ కనిపించడం లేదని చెప్పాడు. ఎంతో ధైర్యంగా బాలుడు ఇచ్చిన ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ .. తండ్రికి ఫోన్ చెయ్యటంతో మైండ్ బ్లాంక్
ఆ పిల్లవాడి ఫిర్యాదు విన్న ఎస్ఐ ఆవుల తిరుపతి బాలుడి తండ్రికి ఫోన్ చేశాడు. భువనగిరి సాత్విక్ సైకిల్ పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. అయితే తండ్రి చెప్పిన మాటలు విని ఎస్ఐకి మైండ్ బ్లాంక్ అయింది. కొడుకు సాత్విక్ బయట ఎక్కువగా తిరుగుతున్నాడని, అందుకే సైకిల్ను తానే ఇంట్లో దాచానని సాత్విక్ తండ్రి చెప్పాడు. వెంటనే బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్ కు కొడుకు కోసం వెళ్ళాడు.

భయం లేకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చి బాలుడి ఫిర్యాదు.. మెచ్చుకున్న పోలీసులు
అయితే ఎలాంటి భయం, ఇంకెవరి సహకారం లేకుండా పోలీస్ స్టేషన్కు సైకిల్ కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సాత్విక్ను ఎస్ఐ తిరుపతి అభినందించారు. ఎలాంటి సమస్య వచ్చినా బాలుడు సాత్విక్ తరహాలో ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని, శాంతి భద్రతలను కాపాడడానికే పోలీసులు పని చేస్తున్నారని ఎస్ఐ ఆవుల తిరుపతి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications