నరసారావుపేటకు అయోధ్య: ఆనంకు అనుచరుడి షాక్
హైదరాబాద్/నెల్లూరు: నరసారావుపేట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థిగా అయోధ్య రామి రెడ్డిని ఖరారు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం నరసారావుపేట లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకసభకు అయోధ్య రామిరెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
వినుకొండ నియోజకవర్గానికి ప్రస్తుతం నన్నపనేని సుధ ఇంఛార్జిగా ఉన్నారు. ఆమెను మార్చి బ్రహ్మనాయుడుకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కొంతకాలం క్రితమే సుధను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది.
ఆనం సోదరులకు షాక్
ఆనం సోదరులకు (మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి) వారు ప్రధాన అనుచరుడు పెంచల్ రెడ్డి షాకిచ్చారు. పెంచల్ రెడ్డి రాష్ట్ర వంట నూనెల వర్తకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి సమక్షంలో ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పెంచల్ రెడ్డి ఆనం సోదరులకు ప్రధాన అనుచరుడే కాకుండా జిల్లాలో కాంగ్రెసు పార్టీలో కీలక నేత. కాగా, మాజీ మేయర్ భానుశ్రీకి ఆనం వివేకానంద రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో అలక వహించిన పెంచల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారని అంటున్నారు.