మీ సహకారం మరువలేనిది - ధన్యవాదములు : ఆనంకు మెసేజ్ - వాట్ నెక్స్ట్..!!
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంకు వరుస షాక్ లు తగులుతున్నాయి. సొంత ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలతో ఆయన నియోజకవర్గానికి పార్టీ తరపున కొత్త ఇంఛార్జ్ ను నియమించారు. దీంతో..ఆయన పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆనం సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని అధికారులు, పార్టీ నేతలు కొత్త ఇంఛార్జ్ ఆనం రాంకుమార్ రెడ్డికి దగ్గరవుతున్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆనంకు మరో సందేశం అందింది. దీని ద్వారా ఆనం సేవలు ఇక చాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఆనం పార్టీ మారటం ఖాయమనే వార్తల నేపథ్యంలో వైసీపీ నుంచి నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆనం కు అందిన సందేశంతో ఇక వైసీపీతో ఆనం బంధం తెగిపోయినట్లేనా అనే చర్చ మొదలైంది.
నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి కీలక సందేశం అందింది. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరో నేతకు పార్టీ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించటం పైన ఆనం కినుక వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కూడా నిలిపివేసారు. పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. దీంతో, పార్టీ శ్రేణులు అధినాయకత్వం మూడ్ గుర్తించి ఆనంతో దూరంగా ఉంటున్నారు.
ఈ సమయంలోనే ఆయనకు జీఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ నుంచి ఒక సందేశం అందింది. అందులో.. 'గడపగడపకు'లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు సందేశం వచ్చింది. దీని ద్వారా ఇక రానున్న రోజుల్లోనూ గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆనం హాజరు కావాల్సిన అవసరం లేదనే విధంగా ఈ సందేశం ఉందని ఆనం మద్దతు దారులు బావిస్తున్నారు.
అటు ఆనం రాం కుమార్ రెడ్డి నియోజకవర్గంలో తన రాజకీయం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే వైసీపీ అభ్యర్ధిగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆనం గతంలో టీడీపీ లో సుదీర్ఘ కాలం పని చేసారు. కాంగ్రెస్ లో జిల్లాలో కీలక నేతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మేకపాటి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉండటంతో, వెంకటగిరి కేటాయించారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేదురుమల్లి, మేకపాటి కుటుంబాలతో ఆనంకు రాజకీయ వైరం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు వెంకటగిరిలో ఆనం ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో రాం కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశంతో ఆనం ఇక.. రాజకీయంగా వైసీపీతో కొనసాగే అంశం పైన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.