ఇక.. అదొక్కటే మిగిలింది.. అదికూడా పూర్తయితే?
ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి రావడంవల్ల ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లురు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది.
తెలుగుదేశం పార్టీ అందివస్తున్న అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలకు పదింటినీ గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టింది. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ కి, వైసీపీ హయాంలో వైసీపీకి కంచుకోటలా నెల్లూరు జిల్లా మారింది. ఎప్పటికైనా ఈ జిల్లాలో పాగా వేయాలని, మెజారిటీ సీట్లు కొల్లగొట్టాలనేది తెలుగుదేశం పార్టీ యోచన.
ఆరు నియోజకవర్గాల్లో వీరి బలం కలిసివస్తుంది
తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు ఎగరవేయడంతోపాటు వారు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి రావడంవల్ల ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లురు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఆనంకు మొదటినుంచి గట్టి పట్టుంది.
పార్టీలో చేర్చుకోవడమే మిగిలింది
అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలోకి వస్తే ప్రయోజనమేనని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. రూరల్ నియోజకవర్గంతోపాటు నెల్లూరు సిటీలోను గట్టి పట్టున్న శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడంవల్ల పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకోవడమే ఇక మిగిలింది. అనధికారికంగా వారు టీడీపీలో చేరినట్లేనని చెబుతున్నారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే చంద్రబాబు ఆదేశిస్తే టీడీపీ టికెట్ పై నెల్లూరు రూరల్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని బహిరంగంగానే ప్రకటించారు.
మౌనం పాటిస్తున్న ఆనం
ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె ఆత్మకూరు నుంచి పోటీచేస్తానంటే ఆనంను నెల్లూరు ఎంపీగా బరిలోకి దించాలనే యోచనతో టీడీపీ అధిష్టానం ఉంది. ఇది కుదరకపోతే ఆత్మకూరు నుంచి ఆనం పోటీచేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఉన్న పార్టీ నేతలు వీరితో సమన్వయం చేసుకునే దిశగా కదులుతున్నారు. ఇప్పటికప్పుడే టీడీపీలో చేరకుండా ఆనం రామనారాయణరెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. వైసీపీ అధిష్టానం స్పందన తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన మౌనం పాటించాలని భావిస్తున్నారు.