ఆనం చంద్రబాబుతో విభేదించింది అందుకేనా..
ఆనం సోదరులు.. ఆ టైటిల్ కు నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపి లో ఓ బ్రాండ్ ఉంది. ద్రురద్రుష్టవశాత్తు ఆ సోదరుల్లో ఒకరు లేకపోయినా మరో సోదరుడు రాజకీయ బలోపేతం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి. వైయస్ హయాంలో రెండు సార్లు మంత్రిగా చేసిన రామనారయణ రెడ్డికి ఆ తర్వాత ఏపి లో కాంగ్రెస్ ఓటమి సమస్యలను తెచ్చిపెట్టింది. ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిపోవడంతో రాజకీయ మనుగడ కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కాని అక్కడ కూడా పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో వైసిపిలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు ఆనం రాంనాయణ రెడ్డి. వచ్చేనెల ఎనిమిదవ తారీఖున వైసీపి అదినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకునప్నారు.

నెల్లూరులో బలమైన నేతగా ముద్రపడ్డ ఆనం ను కాపాడుకోలేక పోయిన చంద్రబాబు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో సారి పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. తన ముప్పై యేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగో సారి ఆయన జంప్ చేయబోతున్నారు. తెలుగుదేశంతో పాలిటిక్స్ ప్రారంభించి అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆనం మళ్ళీ పసుపు కండువా కప్పుకున్నారు. అయితే ఈ సారి యేడాది కాకుండానే ఆయన మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల ఎనిమిదిన ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం జగన్ కు జై కొట్టనున్నట్లు సమాచారం. నెల్లూరు లో బలమైన నాయకుడిగా పేరున్న ఆనం టీడీపీని వీడటం కొంత మేర నష్టమే. ఇదే సమయంలో వైసీపీకి మంచి బలాన్ని చేకూర్చనున్నది. ఆనం రామనారాయణ రెడ్డి సీనియార్టీ జగన్ కు ఉపయోగపడనున్నది.

బాబు ఇచ్చిన మాట తప్పినందుకే పార్టీకి రాంరాం..
నిజానికి తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు ఆయన అసంత్రుప్తిగానే ఉన్నారు. పార్టీలో చేరే సమయంలో తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబునాయుడు ఆనం సోదరులకు హామీ ఇచ్చారు. రామనారాయణ రెడ్డికి ప్రభుత్వంలో కీలక పదవితో పాటు వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది పదవిపైన స్పష్టత రాకపోవడంతో ఆనం సోదరులిద్దరు తీవ్ర అసంత్రుప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. అప్పటికే తీవ్ర అసంత్రుప్తితో ఉన్న రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేతను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనను బుజ్జగించడానికి తెలుగుదేశం నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావడం లేదంటు ఆయన బహిరంగంగానే విమర్శలకు దిగారు.

సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉపయోగించుకోలేక పోయిన టీడిపి..
ఈ క్రమంలోనే రామనారాయణరెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ నుంచి కూడా సంకేతాలు రావడంతో ఆయన రాక ఖరారైంది. ఆత్మకూరు నుంచే ఆయన వైసీపీ తరుపున పోటీ చేసే అవకాశాలున్నట్లు చెపుతున్నారు. రావూరు, నెల్లూరు రూరల్ సీట్ల ను ఆనం పరిశీలించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డిని ఈ సారి పక్కన పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశంతో ప్రారంభించారు. 1983లో టీడీపీలో చేరిన ఆయన 1989 వరకు కొనసాగారు. కొంత కాలం మంత్రిగా కూడా వ్యవహారించిన ఆనం 1994లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా మెలిగిన ఆనం సోదరులు జిల్లాలో నేదురుమల్లికి వ్యతిరేకంగా పావులు కదిపారు. వై.ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామనారాయణ రెడ్డిని మంత్రిగా తీసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో వైసీపి తరుపున కీలక పాత్ర పోషించనున్న ఆనం..
ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో కూడా ఆనం కీలక పాత్ర పోషించారు. వై.ఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్ లో కొనసాగిన ఆనం సోదరులు అవకాశం దొరికినప్పుడల్లా జగన్ పైన విరుచుకుపడే వారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా వీరిద్దరు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లో కొనసాగిన ఆనం బ్రదర్స్ 2017లో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
యేడాది తిరగకుండా పార్టీ మారడానికి ఆనం రామనారాయణరెడ్డి సిద్ధమయ్యారు. గతంలో తన మంత్రి వర్గ సహచరులుగా ఉన్న బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఆయన వైసీపీలో చేరడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆనం ఎంట్రీతో నెల్లూరులో వైసీపీకి మరింత ఉత్సాహం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications