చిరు సినిమాలో నటిస్తా, కానీ!: ఆనం వివేకానంద రెడ్డి
చిత్తూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి 150వ చిత్రంలో మంచి పాత్ర ఉంటే తాను నటిస్తానని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఆనం బుధవారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అనంతరం విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే.
తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. మతతత్వ పార్టీతోనే, స్థానిక పార్టీలోనే తాము చేరేది లేదని ఒకింత ఉద్వేగంతో చెప్పారు.
స్మార్ట్ సిటీలపై తప్పుడు ప్రచారం: వెంకయ్య
వ్యవసాయ భూముల్లో స్మార్ట్ సిటీల నిర్మాణం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెన్నైలో చెప్పారు. స్మార్ట్ సిటీల పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడున్న నగరాలనే స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అపోహలు పెట్టుకోవద్దన్నారు.
స్వైన్ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని మంత్రులు గంటా శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డిలు చెప్పారు. గురువారం కేజీహెచ్లో స్వైన్ఫ్లూపై అధికారులతో సమీక్షించారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని వారు అధికారులను కోరారు.
తుళ్లూరులో నారాయణ
ఏపీ మంత్రి నారాయణ గురువారం నాడు గుంటూరు జిల్లా తుళ్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 29 గ్రామాల రైతులకు రుణవిముక్తి పథకం వర్తిస్తుందన్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల రైతులకు ఏకకాలంలో రుణవిముక్తి కల్పిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో అక్రమ లే అవుట్లపై అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.