షాక్.. వైసిపిలోకి ఆనం విజయ్: బాధేస్తోంది: అద్దెలపై మళ్లీ బాబు
విజయవాడ/హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులతో వచ్చిన ఆనం విజయ్ కుమార్కు జగన్ స్వాగతం పలికారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆనం విజయ్ ఓడిపోయారు. జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరితే, వారికి దగ్గరి బంధువైన ఆనం విజయ్ వైసిపిలో చేరడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతాయనే చెప్పవచ్చు.
అద్దెలపై మరోసారి చంద్రబాబు
ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న వందలాది మంది ఏపీ ఉద్యోగులు మూడు, నాలుగు నెలల తరువాత అమరావతి పరిధిలోని గ్రామాలకు, విజయవాడ, గుంటూరు నగరాలకు తరలి రానున్నారని, ఆ సమయంలో ఇంటి అద్దెలు భారీగా పెంచవద్దని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం సూచించారు.
డబ్బు పైన ఆశతో ఇంటద్దెలు పెంచితే, మొత్తం పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. ప్రజలు ఇంటి అద్దెలు పెంచడం బాధాకరమని, ఈ విషయంలో ప్రజలు అర్థం చేసుకుంటారనే తాను ఆశిస్తున్నానని చెప్పారు. జూన్ తర్వాత పరిపాలన వెలగపూడి నుంచే సాగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలను కోరారు.