ఆనందయ్య ఆయుర్వేదాన్ని అనుమతించాలి.! సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్.!
అమరావతి/హైదరాబాద్ : ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆనందయ్య ఆయుర్వేదంపై అనవసర అపోహలో సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఆనందయ్య ఆయుర్వేదాన్ని ఆపివేయడం సమంజసం కాదని, అనుమానాలు ఉంటే నిపుణులతో పరిశోధన చేయించి నివృత్తి చేసుకోవాలే కానీ వైద్యం ఆపివేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. వైద్యం ఆపివేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
Recommended Video
క్షేత్రస్థాయిలో సైన్స్ కొంత ఉంటుందని, భారతదేశంలో దాదాపు 50 శాతం మంది ఈ వైద్య రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. పుత్తూరు కట్టు, చేప మందు వంటి గ్రామీణ ప్రాంత నాటు, ఆయుర్వేద వైద్యాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఆయుర్వేద వైద్యాన్ని లేబోరేటరీలో పరిశీలించాలనడం సరికాదన్నారు. ఆయుర్వేద వైద్యానికి లేబోరేటరీ వైద్యంతో ముడి పెట్టరాదని నారాయణ సూచించారు.
కాగా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు ఆనందయ్య ఆయుర్వేద వైద్యం అందించడం ప్రారంభించారని నారాయణ తెలిపారు. కరోనా వైరస్ నివారణకు అందిస్తున్న ఈ ఆయుర్వేద వైద్యం ప్రజాదరణ పొందిన విషయం వాస్తవమేనని తెలిపారు. నిజానికి ఆనందయ్య ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి దుష్పలితాలు లేవని వెల్లడించారు. ఒకవేళ దుష్ఫలితాలు ఉంటే రోజుకు 600 నుంచి 700 మంది కోవిడ్ రోగులు వైద్యం కోసం వచ్చే వారు కాదని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70 వేల మందికి వైద్యం అందించారని వెల్లడించారు.
ఈ వైద్యం వల్ల దుష్ప్రభావాలు ఉండి ఉంటే వారందరూ ఈ మందును వాడేవారు కాదు కదా...? అని ప్రశ్నించారు. కోటయ్య అనే వ్యక్తికి ఆయుర్వేద వైద్యం వికటించినదని చెప్పడంలో వాస్తవం లేదని, చక్కెర వ్యాధి ప్రభావం వల్ల అలా జరిగిందని నిర్థారించారని తెలిపారు. ఆయుర్వేద మూలికలు వ్యాధిపై ప్రభావం చూపిస్తాయేతప్ప దుష్ప్రభావాలను చూపించవని నారాయణ పేర్కొన్నారు.