బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో బద్రీనాథ్లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే సమాచారంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఈనెల 18న కెకె ఎక్స్ప్రెస్లో హిందూపురం, మడకశిర, కదిరి, తనకల్లు, బెళగుప్ప, కర్నాటకలోని బళ్ళారి, పావగడ, వైఎస్కోట ప్రాంతాల్లోని సమీప బంధువులంతా కలిసి ఉత్తరాఖండ్లోని వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బద్రీనాథ్ వెళ్లాల్సివుండగా వాతావరణం అనుకూలించక రైళ్లలో చేరుకున్నారు.
బద్రీనాథ్లో చండీహోమం నిర్వహించేందుకు వీరంతా వెళ్లారు. హిందూపురానికి చెందిన ఓ హోటల్ నిర్వాహకుడు వీరిని బద్రీనాథ్ యాత్రకు తీసుకువెళ్లాడు. గురు, శుక్రవారం హోమం నిర్వహించారు. బద్రీనాథ్లో పూజల అనంతరం వీరంతా కేథార్నాథ్, ఇతర పుణ్యక్షేత్రాలు సందర్శించాల్సి ఉంది. అయితే ఈనెల 21నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్డు మార్గాలు దెబ్బ తిన్నాయి.
మడకశిర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు బద్రీనాథ్ సమీపంలోని సత్యబాబా ఆశ్రమంలో ఉన్నట్టు ఇక్కడి బంధువులకు ఫోన్లో సమాచారం అందించారు. ఇదే ఆశ్రమంలో తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగువేల మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, బెళగుప్ప నుంచి వెళ్లిన సోమన్న, వేణుగోపాల్ కుటుంబం బద్రీనాథ్లో ఓ హోటల్లో బస చేసినట్టు బంధువులకు సమాచారం అందించారు. హిందూపురం నుంచి వెళ్లినవారంతా బద్రీనాథ్లోని అన్న సత్రంలో తలదాచుకున్నట్టు బంధువులకు సమాచారం అందించారు. కదిరి ప్రాంతానికి చెందిన వారు బద్రీనాథ్లోని అక్షయ ఆశ్రమంలో ఉన్నట్టు తెలిసింది.
యాత్రికులను రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రభవన్ అధికారులను ఆదేశించారు. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలావుంటే, యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జాయింట్ కలెక్టరు బి లక్ష్మీకాంతం వెల్లడించారు. యాత్రికుల క్షేమ సమాచారాల గురించి డెహ్రాడూన్ అధికార యంత్రాంగంతో సంప్రదిస్తూనే ఉన్నానని లక్ష్మీకాంతం మీడియాతో అన్నారు.
వీరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. భక్తుల క్షేమసమాచారాల కోసం 08554-220000 నెంబరును సంప్రదించవచ్చన్నారు. దీంతోపాటు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణశాఖ ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసిందన్నారు. 01352710334 నంబరుకు ఫోన్ చేసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చన్నారు. అక్కడ వరదలు తగ్గుముఖం పట్టగానే యాత్రికులను క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తామన్నారు.
యాత్రకు వెళ్లిన వారిలో హిందూపురం పట్టణానికి చెందిన సప్తగిరి ఫైనాన్స్ యజమాని సత్యనారాయణ గుప్తా దంపతులతో పాటు అయ్యప్ప చాట్స్ నిర్వాహకులు శబరీష్ దంపతులు, తొమ్మిదేళ్ల కుమారుడు, లేపాక్షికి చెందిన అర్చకులు సునీల్, రుక్మిణి టెక్స్టైల్స్ యజమాని సత్యనారాయణ దంపతులు, నాగేష్, వెంకటేష్ కుటుంబాలవారు ఉన్నారు.
బెళుగుప్పకు చెందిన సోమన్న, వేణుగోపాల్ కుటుంబ సభ్యులు బద్రీనాథ్ యాత్రకు వెళ్లి అక్కడ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారు అందించిన సమాచారం మేరకు బెళుగుప్పకు చెందిన సత్రసాల సోమన్న భార్య శశికళ, తమ్ముడు వేణుగోపాల్, భార్య విమల, కూమార్తెలు విధాత్రి, విజ్ఞాత్రి హిందూపురంలోని బంధువులతో కలిసి గత వారంలో బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు.
కదిరి నుంచి వెళ్లిన భక్తులు బద్రీనాథ్లోని అక్షయ ఆశ్రమంలో తలదాచుకున్నట్లు తెలిపారు. వారిలో యాధాలం శ్రీనివాసులు, అతని భార్య కళ్యాణి, కుమార్తె పండు, కుమారుడు సూర్యతేజ, సోదరుడు యాదాలం బాలాజి, అతని భార్య సుప్రజ, కుమారుడు మంజూస్, కదిరి పట్టణానికే చెందిన ఉపాద్యాయుడు సత్యనారాయణ, అతని కుమార్తెలు వైష్ణవి, దీపిక, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు చెందిన రత్నకుమార్ అతని భార్య రాజేశ్వరమ్మ వున్నారు.