వదంతులు నమ్మొద్దు: చంద్రబాబు: సచివాలయ ఉద్యోగులకు ఊరట
విజయవాడ: రాష్ట్రంలోని బ్యాంకుల్లో డబ్బులు లేవన్న వదంతులొస్తే నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. బుధవారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో ఆర్బీఐ, బ్యాంకర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు వేతనంలో రూ.10వేలు చొప్పున నగదు రూపంలో ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.
నగదు రహిత చెల్లింపుల్లో ఇబ్బందులను అధిగమించేందుకు కమిటీలు వేస్తామని తెలిపారు. డబ్బులు లేకపోయినా.. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందేలా చూస్తామన్నారు. రైతు బజార్లు సహా ఇతర ప్రాంతాలను ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా రియల్ టైమ్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
సామాన్యులకు ఇబ్బందులు తగ్గించేందుకు సమష్టి కృషి చేయాల్సి ఉందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరెన్సీ తక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయాలు అవలంభించాలని, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డులు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో 16,21,300 మందికి బ్యాంకు ఖాతాలు లేవని, ఇప్పటి వరకు లక్షమందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఇవ్వగలిగామన్నారు.
సచివాలయ ఉద్యోగులకు ఊరట
సచివాలయ ఉద్యోగులకు వేతనాలు నగదు రూపంలో చెల్లించేందుకు ఏపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు హైదరాబాద్లోని ఎస్బీహెచ్లో ఉండటంతో ఆ బ్యాంకుకు సంబంధించి తాత్కాలిక కౌంటర్ను అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో వేతనాల కోసం తాత్కాలిక ఎస్బీహెచ్ కౌంటర్ వద్ద ఉద్యోగులు బారులు తీరారు. ప్రభుత్వం ఏర్పాట్ల పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఈ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అధికారక పాలన ప్రారంభం
వెలగపూడిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నుంచి అధికారికంగా పరిపాలన ప్రారంభించారు. బుధవారం ఉదయం సరిగ్గా 11.45గంటలకు సచివాలయానికి చేరుకున్న ఆయనకు ఉద్యోగులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఉద్వేగంతో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వెలగపూడి సచివాలయం నుంచి పరిపాలన సాగించటం తనకు రెండో మజిలీ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
కొత్త శకం
నవ్యాంధ్ర చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మీ త్యాగాలు ఊరికే పోవు. మీ ఇబ్బందులు తొలగించేందుకు ఎల్లవేళలా తోడుగా ఉంటా' అంటూ ఉద్యోగులకు భరోసా కల్పించారు. ప్రపంచంలో ఏ రాజధానికీ లేనన్ని ఆకర్షణలు అమరావతికి ఉన్నాయని, కృష్ణానది, వాస్తు, పర్వత శ్రేణులు, పచ్చదనం అమరావతి సొంతమని అన్నారు. ఉద్యోగులతో మాట్లాడాక, ఆయన తన చాంబర్కు చేరుకున్నారు.
రోడ్ల నిర్మాణంపై..
వెలగపూడి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో మొదటి రోజు నుంచే తనదైన రీతిలో విధులు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యాలయంలోనే ఉన్న చంద్రబాబు అమరావతిలో రోడ్ల నిర్మాణంపై పురపాలక శాఖ అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో ఆయన కార్యాలయం ఉన్న బ్లాక్ -1 వద్ద ఆయనకు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు.
ఉద్యోగులు కష్టపడుతున్నారు
ఈసందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు వారు ఏన్నో కష్టాలు పడ్డారని, రాజధాని కోసం ఇన్ని ఇబ్బందులు పడిన చరిత్ర ఇంకెక్కడా లేదని తెలిపారు. తొమ్మిది సంవత్సరాలు శ్రమించి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపానని గుర్తుచేశారు. ఇప్పుడు నవ్యాంధ్ర కోసం అంతకుమించి కష్టపడుతున్నానన్నారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రయాణం ప్రారంభించామన్నారు.
బాబుకు స్వాగతం
విజయవాడలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే వరకూ బస్లోనే ఉండి పాలన సాగించానని, ఇప్పుడు వెలగపూడి సచివాలయం నుంచి చేస్తానన్నారు. ఇది తన రెండో ప్రయాణం ప్రారంభించామన్నారు. సిఎం కార్యదర్శులు సతీష్ చంద్ర, రాజవౌళి, నగర పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.