పాదయాత్రలో ఇచ్చిన ఆ కీలక హామీని నెరవేర్చిన నారా లోకేష్
Nara Lokesh: ఈ నెల 17వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలను అధికార యంత్రాంగం నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు, సమావేశాలు, ఇష్టాగోష్టీలను ఏర్పాటు చేస్తారు.

అనంతపురంలో రాష్ట్ర స్థాయి సదస్సులు, ఉత్సవాలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో గల అన్ని జిల్లాలతో పోల్చుకుంటే వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లా ఇదే. అందుకే అనంతపురంలో వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఐటీ, మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రను గుర్తు చేసుకున్నారు.
యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా…
— Lokesh Nara (@naralokesh) October 13, 2024
యువగళం పాదయాత్ర సందర్భంగా అనంతపురానికి చేరుకున్నప్పుడు బోయ, వాల్మీకి సామాజిక వర్గం నాయకులు తనను కలిశారని, వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామంటూ అప్పట్లో తాను వారికి హామీ ఇచ్చానని నారా లోకేష్ చెప్పారు.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. వాళ్ల విజ్ఞప్తిని గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈ నెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. అదే రోజు అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తామని, తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లని, వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications