పవన్ పై ఆంధ్రజ్యోతి పోలీసులకు ఫిర్యాదు:సినీ ఫీల్డ్ కు చలసాని శ్రీనివాస్ వార్నింగ్
Recommended Video
సినీ హీరో పవన్ కల్యాణ్, అతని అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం తమ ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ నుద్దేశించి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమా నటులు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అందువల్లే తెలుగు సినీ పరిశ్రమకు త్వరలోనే అల్టిమేటం ఇవ్వాలని నిర్ణయించినట్లు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు.
పవన్ పై...పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అతని అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ సోషల్మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు ప్రత్యేకించి కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎబిఎన్ కు ...జర్నలిస్టుల మద్దతు
మీడియా, మీడియాలోని వ్యక్తుల పట్ల పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచారు. మీడియాపై పవన్ కల్యాణ్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఒక మీడియాను టార్గెట్ చేస్తే మిగిలిన వాళ్లు సైలెంట్గా ఉండడం మంచిది కాదని, మిగిలిన మీడియా సంస్థలు జర్నలిస్టులు కూడా కలసి రావాలని కోరారు. అలాగే పవన్ చేస్తున్న దాడి అన్ని మీడియా సంస్థలకూ వర్తించే విధంగా ఉందని, ఈ విషయంపై అందరూ కలిసికట్టుగా పోరాడదామని జర్నలిస్ట్ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
మంగళవారం...సోషల్ మీడియాపై ఫిర్యాదు...
తమ సంస్థ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ సంస్థ లోగోలు వాడుకుంటూ సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేస్తున్నారని దానికి తమకూ ఎలాంటి సంబంధం లేదని ఎండీ రాధాకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్కే ఏబీఎన్ పేరుతో ట్విటర్ లో తప్పుడు ఖాతా తెరిచి తమకు సంబంధం లేని పోస్టులు వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్విటర్ లో ఎబిఎన్ తెలుగు టివి, ఆంధ్రజ్యోతి అని ఆంగ్లాక్షరాలతో అకౌంట్లు తప్ప మరే ఇతర అకౌంట్లు లేవని ఆంధ్రజ్యోతి ప్రకటించింది.
తెలుగు సినీ ఫీల్డ్ కు వార్నింగ్...
తెలుగు సినీ పరిశ్రమకు త్వరలో అల్టిమేటం ఇవ్వనున్నట్లు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఒకవైపు ప్రత్యేక హోదాకు తెలంగాణ నాయకులు, సినీ నటులు సైతం మద్దతు తెలుపుతున్నా తెలుగు సినీ పరిశ్రమ మాత్రం పట్టనట్లు ఉండటం క్షమార్హం కాదన్నారు.ప్రత్యేక హోదా ఉద్యమంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్బాబు పాల్గొనలేదని, కానీ తెలంగాణకు చెందిన నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారని, ఇది అందరూ గమనించాల్సిన విషయమని అన్నారు.