నిషిత్ మృతికి జగన్ సహా నేతల సంతాపం: లోకేష్ వెనక్కి, రాత్రికి నెల్లూరుకు మంత్రి నారాయణ
హైదరాబాద్/అమరావతి: మంత్రి నారాయణ తనయుడు నిషిత్ మృతి చెందిన విషయం తెలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సంతాపం తెలిపారు. మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వేగం వల్ల ప్రమాదం
హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో రోడ్డు నెంబర్ 36లో మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన ఘటనలో నిషిత్ నారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. నిషిత్తో పాటు స్నేహితుడు రాజా రవివర్మ కూడా మృతి చెందారు. మత్తులో ఉండటంతో పాటు అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందంటున్నారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
నిషిత్ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. నిషిత్ ఆత్మకు శాంతి కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న లోకేష్
మరోవైపు, మంత్రి నారా లోకేష్ విషయం తెలియగానే ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాదు బయల్దేరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు.
పలువురు మంత్రి నారాయణ నివాసానికి చేరుకున్నారు. నారాయణ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భారీగా ఆసుపత్రికి, మంత్రి నారాయణ నివాసానికి చేరుకుంటున్నారు.
రాత్రికి ఇంటికి చేరుకోనున్న మంత్రి నారాయణ
నిషిత్ నారాయణ మృతదేహాన్ని ఈ రోజు (బుధవారం) నెల్లూరు తరలిస్తారు. మరోపక్క, లండన్ పర్యటనలో ఉన్న నారాయణ అక్కడి నుంచి బయల్దేరారు. నేటి సాయంత్రం ఎనిమిది గంటలకు ఆయన చెన్నై చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఆయన నెల్లూరు పయనమవుతారు. రేపు (గురువారం) ఉదయం నెల్లూరులో నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.