ఏపీ అసెంబ్లీలో ఫొటో సెషన్- పార్టీలకతీతంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చిట్ చాట్..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటితో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు వేర్వేరుగా ఫొటో సెషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ సందర్భంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం సీఎం చంద్రబాబుతో మాట్లాడుతూ, "మీతో ఫొటో దిగడం నా అదృష్టం" అని వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడకపోయినా .. ఈ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం కంగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే త్వరలో రిటైర్ రాబోతున్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగాలని కోరారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా చేతిలో ఓడిన లక్ష్మణరావు కోరికను చంద్రబాబు మన్నించి ఫొటో దిగారు.

అలాగే మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వడం లేదని మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు, ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో సరదాగా వ్యాఖ్యానించగా..దీనిపై సీఎం స్పందిస్తూ, "పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలి" అని సూచించారు. ఫొటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా.. ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. అయితే బొత్స పొరపాటున వేరే కుర్చీలో కూర్చున్నారు. దీంతో డిప్యూటీ సీఎం సీటుకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన మంత్రి నారా లోకేష్, బొత్సను ఏమీ అనకుండా మరో కుర్చీ ఏర్పాటు చేయించారు.












Click it and Unblock the Notifications