ఏపీలో సినీ ఫక్కీలో స్ధానిక పోరు: అచ్చుగుద్దినట్లు అలాగే పోలీసుల హంగామా !
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సమీపిస్తున్న కొద్దీ విపక్ష టీడీపీకి కష్టాలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో మద్యం బాటిళ్లు, డబ్బు కట్టలను తమ ఇళ్లలోకి తీసుకొచ్చి పడేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యలను అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ, ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా పల్నాడు గ్రామాల్లో ఎన్నికలంటేనే ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే పరిస్ధితులు ఉంటాయి. ఇక్కడి గ్రామాల్లో ఫ్యాక్షన్ తగాదాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరికీ తెలియవు. కానీ ఈసారి అనూహ్యంగా ప్రభుత్వం స్ధానిక ఎన్నికల కోసం తీసుకొచ్చిన నిబంధనలను వాడుకుంటూ పోలీసులు టీడీపీ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సంధర్భంగా మద్యం కానీ, డబ్బు కానీ పంచితే అభ్యర్ధులపై అనర్హత వేటు వేయడంతో పాటు జైలుకు పంపేలా తాజాగా పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలు సవరించారు.
సినీ ఫక్కీలో మద్యం బాటిళ్లు, డబ్బు కట్టలు
తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఇళ్లలో సైతం మద్యం, డబ్బు ఉన్నా చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీంతో పల్నాడు గ్రామాల్లో పోలీసులు చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా తామే మద్యం బాటిళ్లు, డబ్బు కట్టలను టీడీపీ నేతల ఇళ్లకు తీసుకెళ్లి పెట్టి మరీ వారిని దోషులుగా చిత్రీకరించి కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్ధానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మద్యం బాటిళ్లు, డబ్బు కట్టలను తమ ఇళ్లలో పెట్టే వీడియోలను టీడీపీ ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు వీరు పంపుతున్నారు.
అక్రమ కేసులతో అభ్యర్ధుల బెంబేలు
టీడీపీ, వైసీపీ రాజకీయాలు పోటాపోటీగా ఉండే పల్నాడు ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యర్ధులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా వైసీపీ ఈసారి స్ధానిక పోరును క్లీన్ స్వీప్ చేసేందుకు వీలుగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని పలు కొత్త నిబంధనలు తీసుకురావడంపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్ధుల ఇళ్లపై అక్రమంగా మద్యం, డబ్బు దొరకడంతఇప్పుడు వారంతా ఆత్మరక్షణలో పడిపోతున్న పరిస్దితి.
Recommended Video
టీడీపీ వాట్సాప్ - చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో స్ధానిక ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతల దాడులను ముందుగానే ఊహించిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఓ వాట్సాప్ నంబరును ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలెవరైనా దాడులకు పాల్పడితే సదరు వీడియోలను ఆ నంబరుకు వాట్సాప్ చేయాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. దీంతో ఇప్పుడు పోలీసులు అక్రమ మద్యం, డబ్బు తీసుకొచ్చి పెడుతున్న వీడియోలను వారు టీడీపీ వాట్సాప్ కు పంపుతున్నారు. వీటి ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు డీజీపీతో పాటు ఈసీకి కూడా లేఖ రాశారు.