రైతుల సమస్యలపై వైసీపీ పట్టు: సభలో గందరగోళం, మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా?: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది.
రైతు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, కరవు సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా:
రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. రైతు సమస్యలపై సరైన సమయంలో చర్చిద్దామని సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టువీడక పోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా?: జగన్
రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని శాసనసభా ప్రతిపక్ష నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. 10 నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడుతూ సమస్యలపై చర్చలకు ప్రభుత్వం వెనకాడుతోందన్నారు.
ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటూ మైక్ కట్ చేయటం సమంజసమేనా అని వైయస్ జగన్ ప్రశ్నించారు. 40 రోజులు పాటు జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 17 రోజులకు కుదించటం ఎంతమాత్రం సరికాదన్నారు. రైతులు చాలా బాధల్లో ఉన్నారన్నారు.
బీఏసీ సమావేశంలో కూడా రైతు సమస్యలపై చర్చించాలని సూచించామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడాతూ బీఏసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications