చొక్కా పట్టుకొని అడిగితేనే, నన్ను తొక్కుతున్నారు.. నాతో పెట్టుకుంటే: బాబుపై పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఇటీవల విద్యుత్ ఘాతంతో మృతి చెందిన తన అభిమానుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మూడు రోజుల క్రితం పాయకరావుపేటలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పవన్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ తీగలు తాకి శివ, నాగన్న అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి కటుంబాలను పవన్ పరామర్శించనున్నారు.
మరోవైపు, అంతకుముందు రోజు ఆయన పాడేరు, మాడుగుల, వడ్డాది, రావికమతం, నర్సీపట్నంల్లో పవన్ తన విశాఖ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాక్సైట్ మైనింగ్ ఆపేశామని టీడీపీ చెబుతోందని, కానీ లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుతున్నారని ఆరోపించారు. బాక్సైట్ మైనింగ్ పాలసీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వత్తాసు పలుకుతున్నారన్నారు.

సినిమాల్లో కాదు.. బయటకు వచ్చి చొక్కా పట్టుకొని అడిగితేనే
అవినీతి పెరిగితే నిలదీస్తామని మొదటే చెప్పానని, దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేయాలన్నది తన కోరిక అన్నారు. సినిమాలతో సమస్యలు తీరవన్నారు. బయటకు వచ్చి చొక్కా పట్టుకుని అడిగితేనే సమస్యలు తీరుతాయన్నారు. నేను ప్రత్యేక హోదా అడిగితే బెదిరించారని, ఏదైనా చేసుకోండి, మడమ తిప్పనని చెప్పానని, దేనికీ భయపడే వ్యక్తిని కానని, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైందని, సహజ వనరులు, నదులున్నా వలసలు తప్పడం లేదని, సరిచేయకపోతే ప్రత్యేక వేర్పాటు ఉద్యమాలొస్తాయని హెచ్చరించారు. తాను ఎవరినీ రెచ్చగొట్టడం లేదని న్యాయం కోసం నిలదీస్తున్నానని చెప్పారు.

కబ్జాలు ఉన్నాయని మీ మంత్రే చెప్పారు
భూకబ్జాలు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెబుతున్నారని, విశాఖలో అడ్డగోలుగా భూముల కబ్జా జరిగిందని స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతకు మించి రుజువులు ఏం కావాలన్నారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు విశాఖలో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారని, ఆ పరిశ్రమలు ఏవని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించేందుకే తాను వచ్చానని చెప్పారు.

2014లో పోటీ చేయకుండా తప్పు చేశా
2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పు చేశానని పవన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు పోటీ చేస్తే కనీసం 5 నుంచి 10 సీట్లు అయినా వచ్చి ఉండేవని, అప్పుడు టీడీపీ వైఫల్యాలను, అవినీతిని నిలదీసి ఉండేవాడినని చెప్పారు. 2014లో అవినీతి పార్టీలను అడ్డుకోవానికి కలిసి ప్రయాణం చేద్దామంటే చంద్రబాబు సరేనని చెప్పారని, కానీ ఇప్పుడు ఆయనే అవినీతికి పాల్పడుతున్నారని, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానన్నారు. హైదరాబాద్లో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారని, అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకరిస్తున్నారన్నారు.

నాతో పెట్టుకోవద్దు, నన్ను తొక్కుతున్నారు
ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే అప్పు ఇస్తే ఏనుగును అయినా కొనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి ఓ ఏనుగు అని, ఏనుగును ఎవరైనా పెంచుకోగలరా అని, దానిని మేపడం ఎంత కష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని జిల్లాలపై సీరియస్నెస్ లేదన్నారు. స్థానిక గంజాయి సమస్యను అశోక్ గజపతి రాజు సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. నేను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానని, కులాలను నమ్ముకుంటున్నానని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆ మాట అనడానికి ఆయనకు సిగ్గుండాలన్నారు. టీడీపీలో ప్రతి నాయకుడి బండారం, దోపిడీ గురించి తెలుసునని, తనతో డొంకతిరుగుడు వ్యవహారాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. చంద్రబాబులా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదవడం లేదని, మనసు లోతుల్లో నుంచి వచ్చిన భావాలే మాటలు అన్నారు. కులాల ఐక్యత ఉంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. మీరు గద్దె ఎక్కి నన్ను తొక్కుతున్నారని, దృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకొని మాట్లాడొద్దని, వయసుకు తగ్గ మాటలు కావన్నారు.












Click it and Unblock the Notifications