వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వైఎస్ జగన్?: ఆ స్థానంలో ఆ సలహాదారు: పార్టీలో జోరుగా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. అటు ముఖ్యమంత్రిగా గ్రామస్థాయి పరిపాలనలో సమూల మార్పులను తీసుకుని వచ్చే దిశగా పలు కీలక సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటిస్తోన్న ఆయన ఈ సారి పార్టీ పరంగా అనూహ్య నిర్ణయాలను తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆయన ఇప్పటికే కొందరు సన్నిహితులతో తన అభిప్రాయాలను పంచుకున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా మేనిఫెస్టో అమలుపైనే
ముఖ్యమంత్రిగా మేనిఫెస్టో అమలుపైనే
అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ పరిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం.. వంటి చర్యలపైనే ఫోకస్ పెట్టారు. తొలి ఏడాదిలోనే దాదాపు 90 శాతం మేర ఎన్నికల హామీలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని సాధించామనీ స్వయంగా వైఎస్ జగన్ స్పష్టం చేయడం.. పాలనపై ఆయన ఏ స్థాయిలో పట్టు సాధించడానికి ప్రయత్నించారనేది అర్థం చేసుకోవచ్చు.

పార్టీ సమావేశాలు నామమాత్రంగానే..
ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్న తరువాత..వైఎస్ జగన్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా తక్కువే. పార్టీ నాయకులను సమన్వయం చేసిన సందర్భాలు ఈ ఏడాది కాలంలో పెద్దగా కనిపించవు. మొదట్లో ఒకట్రెండు సార్లు పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు తప్పితే పెద్దగా వైసీపీ క్యాడర్పై ఫోకస్ పెట్టలేదు. ఈ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డికి అప్పగించారు. పార్టీ నాయకులను కలవడం, తరచూ వారితో సమావేశాలను ఏర్పాటు చేసే బాధ్యతలను సాయిరెడ్డి తీసుకున్నారు.

జగన్ తరువాత పార్టీలో నంబర్-2గా ఉన్నా
వైఎస్ జగన్ తరువాత వైసీపీలో నంబర్-2గా ఉంటున్నారు విజయసాయి రెడ్డి. పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీకి కూడా సాయిరెడ్డి సారథ్యాన్ని వహిస్తున్నారు. మున్ముందు ఆయన దేశ రాజధానికే పరిమితం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. 22 మంది లోక్సభతో పాటు రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. దేశంలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా మారాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకునే నిర్ణయాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఎవరు చూడాలన్న దానిపై స్పష్టత రాలేదని అంటున్నారు.

సజ్జల పేరు బలంగా..
దీనితో పార్టీలో మార్పులను తీసుకుని రావాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించవచ్చని సమాచారం. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సజ్జల పేరును ప్రకటించవచ్చనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రజా వ్యవహారాల సలహాదారుగా పని చేస్తున్నారు. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నేతలతో సజ్జలకు సత్సంబంధాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా సజ్జల రామకృష్ణా రెడ్డి తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. కరోనా పరిస్థితులు కుదురుకున్న తరువాత ఈ దిశగా ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
Recommended Video

వైఎస్ షర్మిల పేరును పరిశీలించినా..
సజ్జల కంటే ముందు వైఎస్ షర్మిల పేరును జగన్ పరిశీలించారని అంటున్నారు. ఈ విషయంలో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయారని అంటున్నారు. పెద్దగా రాజకీయ అనుభవం లేని తాను ఏకంగా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాల్సి రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని భావించారని అంటున్నారు. దీనితోపాటు కుటుంబ పార్టీ అనే ముద్ర పడుతుందని, దీర్ఘకాలంలో అలాంటి మచ్చ మంచిది కాదనే అభిప్రాయం జగన్ కుటుంబ సభ్యుల్లో వ్యక్తమైనట్లు చెబుతున్నారు. అందుకే- పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ నమ్మకస్తుడిగా పేరున్న సజ్జలకు పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications