Union Budget 2020: ఏపీకి మొండిచేయి.. సీఎం జగన్ బాటలో కేంద్రం నడవాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
2020-21 ఏడాదికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ ద్వారా ఒరిగిందేమీ లేదని, కేటాయింపుల్లో మొండిచేయి చూపించారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ ఆవరణలో విజయసాయి మీడియాతో మాట్లాడారు.

మోదీపై నిప్పులు
ఇవాళ్టి కేంద్ర బడ్జెట్ ను వైసీపీ మూడు అంశాల ప్రాతిపదికన చూస్తున్నదని, 1.ఆర్థిక సర్వే, 2.బడ్జెట్ ప్రకటన, 3.ఏపికి ప్రత్యేక కేటాయింపులు వారీగా పరిశీలిస్తే చాలాచాలా నిరాశకలిగించిందని విజయసాయిరెడ్డి అన్నారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఏపీ పట్ల కేంద్రం కనికరం చూపాల్సిందిపోయి, పక్షపాతంతో, కక్షపూరిత వైఖరిని ప్రదర్శించినట్లుగా అనిపించిందని ఆయన చెప్పారు.

చాలా ఆశలు పెట్టుకున్నాం..
‘‘ఆర్థిక సర్వేలో ఏపీకి సంబంధించి రెండు కీలక అంశాలను పేర్కొన్నారు. విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం ఇస్తానన్న నిధులు పెండింగ్ లో ఉన్నాయి. అన్నింటికీ మించి ఏపీకి ప్రత్యేక హోదా, ప్రకటించాల్సిఉన్న గ్రాంట్లు, ఇన్సెంటివ్ లు ఇతరత్రాపై మేం చాలా ఆశలు పెట్టుకున్నాం. వాటిలో ఏఒక్కదానిపైనా బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం బాధాకరం''అని విజయసాయి అన్నారు.

జగన్ పథకాలే ఆదర్శంకావాలి..
దేశసమగ్రాభివృద్ధి, సంపద సృష్టి అనే కాన్పెప్టులతో మోడీ సర్కార్ 2020-21 బడ్జెట్ రూపొందించినట్లుగా అర్థమవుతున్నదని, అయితే వాస్తవ కేటాయింలకు వచ్చేసరికి మాత్రం ఏపీ లాంటి రాష్ట్రాల పట్ల పక్షపాతం ప్రదర్శించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని వైసీపీ ఎంపీ అన్నారు. 2022 నాటికి రైతుల సంపాదనను రెట్టింపు చేస్తామంటోన్న మోదీ సర్కార్.. దానికి సంబంధించిన విధివిధానాలను మాత్రం వెల్లడించకపోవడమేంటని ప్రశ్నించారు. సమగ్రాభివృద్ధి, సంపద సృష్టే ధ్యేయంగా ఏపీలో సీఎం జగన్ ‘నవరత్నాలు‘ పథకాల్ని అమల్లోకి తెచ్చారని, మోదీ సర్కారు కూడా వాటిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నట్లు విజయసాయి చెప్పారు.

ఏపీ వాటా ఇవ్వాల్సిందే..
బడ్జెట్ లో ఆయా రంగాలకు చేసిన కేటాయింపుల్లో ఏపీకి దక్కాల్సిన వాటా ప్రతి పైసాని సకాలంలో ఇవ్వాల్సిందేనని, వాటితోపాటు పెండింగ్ నిధులూ విడుదల చేయాలని విజయసాయి కోరారు. ఏపీకి కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టును ఇవ్వకపోవడం దారుణమన్నారు. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామమమైతే, ద్రవ్యోల్బణం, ఆన్లైన్లో విద్యపై జీఎస్టీ పెంపు తదిర అంశాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications