ఘోర విషాదం: రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య, నలుగురు పిల్లలతోపాటు భార్య, భర్త మృతి
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో పాటు భార్య, భర్త మృతిచెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన పాశం సునీల్ (28)కు ప్రకాశం జిల్లా కందుకూరు నాంచారమ్మ కాలనీకి చెందిన రమ(24)తో వివాహమైంది. వీరు కడప జిల్లా బద్వేలు గాంధీనగర్ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటూ మిక్సీ, గ్రైండర్లు వాయిదాల పద్ధతిపై ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఉషా (5), మూడేళ్ల వయసున్న కవల పిల్లలు కళ్యాణ్, కళ్యాణి, 8 నెలల వయసున్న బాబు ఉన్నారు.

మే 9వ తేదీన వీరంతా కందుకూరు కృష్ణబలిజపాలెంలో బంధువుల వివాహానికి వచ్చారు. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బద్వేలుకు తిరుగు ప్రయాణమయ్యేందుకు వీరు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉలవపాడు రైల్వేస్టేషన్కు వచ్చారు.
రాత్రి 8.05గంటల సమయంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఉలవపాటు స్టేషన్కు చేరుకోగానే వీరు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్లాట్ఫారానికి ఓ వైపు చివరన వీరు కూర్చున్నారని, ఇది ప్రమాద ఘటన కాదని.. ఆత్మహత్యేనని స్టేషన్మాస్టర్ తెలిపారు. ఆత్మహత్య కారణంగా రైలును 20నిమిషాలపాటు నిలిపివేశారు. కందుకూరు డీఎస్పీ ప్రకాశ్రావు, ఆర్పీఎఫ్ సీఐ అనురాగ్ కుమార్ సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications