ఏపీలో చంద్రబాబు మరో కొత్త పథకం.. నెలకు రూ.10వేలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని న్యాయమిత్రగా మార్చారు. జూనియర్ న్యాయవాదులుగా ఉన్నవారు వృత్తిలో నిలదొక్కుకునేంతవరకు వారికి ఆర్థికంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వారికి నెలకు రూ.5వేల స్టైఫండ్ ను ఇచ్చేది.
త్వరలోనే మార్గదర్శకాల జారీ
ఇకనుంచి వారికి నెలకు గౌరవ వేతనం కింద రూ.10వేలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. న్యాయశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు చేయడంతోపాటు పెంచిన రూ.10వేలకు సంబందించి మార్గదర్శకాలు జారీచేయాలంటూ అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో దీనికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు అతి త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ దిశగా కసరత్తులు ప్రారంభమయ్యాయి.

కేంద్రానికి హైకోర్టు బెంచ్ కోసం ప్రతిపాదనలు
ఎన్నికల సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే దీనిపై కేబినెట్ తీర్మానం చేయబోతోంది. ఈ సందర్భంగా న్యాయశాఖకు సంబంధించిన అధికారులు ప్రాసిక్యూషన్ పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. నేరానికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదు అనేలా నిందితులకు భయం కలిగించాలని, అలాగే ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా ఆక్రమిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలని, అనవసరమైన వివాదాలకు పోవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications