రైతులకు రూ.లక్ష.. మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా వచ్చిన వరదల్లో నష్టపోయిన అన్నదాతలకు అదనపు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పంటలకు ఎవరెవరు బీమా చేయించుకున్నారు? ఎవరెవరు బీమా చేయించుకోలేదు? బీమా చేయించుకోకపోతే వారికి ఏవిధంగా పరిహారం అందించాలనే విషయంపై అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ప్రకటించారు.
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తాజాగా ఏపీలో పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే పంటలకు బీమా అమలు చేయనున్నారు. ఆన్ లైన్ లో నమోదు చేయించుకొని ఈకేవైసీ చేయించుకోవాలి. ఇలా చేయించుకుంటేనే పంటల బీమా వర్తిస్తుంది. రైతులు త్వరపడాలని జిల్లా వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు. బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతులకు వరిపంట సాగుచేస్తే వారికి హెక్టారుకు రూ.లక్ష చొప్పున పరిహారం అందుతుంది. అలాగే హెక్టారు పత్తికి రూ.లక్ష, వేరుశనగ పంటకు రూ.70వేల చొప్పున బీమా పరిహారం అందుతుంది.

మూడు యూనిట్లుగా జిల్లా విభజన
బీమా కోసం జిల్లాను మూడు యూనిట్లుగా విభజించారు. గ్రామస్థాయి యూనిట్లలో వరి పంటలు, మండల స్థాయి యూనిట్లలో కంది, జొన్న, ఎండుమిర్చి, ఆముదం పంటలతోపాటు జిల్లా స్థాయి యూనిట్లలో సజ్జ, ఉల్లి, కొర్ర పంటలకు ఉచిత బీమా వర్తించనుంది. వేరుశనగ పంటకు జులై 16 నుంచి అక్టోబరు 31 వరకు, పత్తికి జులై 1 నుంచి నవంబరు 30 వరకు వాతావరణ బీమా అమలును లెక్కిస్తారు. గతేడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొన్ని పంటలకు బీమా అమలు చేయలేదు. వీటికి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనివల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని వేరుశనగ, మిరప, వరి, పత్తి పంటలు సాగు చేసే రైతులకు లాభం కలుగుతుంది.












Click it and Unblock the Notifications