సీఎం జగన్ కీలక నిర్ణయం : ఆ ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్లోని ఇద్దరు మంత్రుల పోర్ట్ ఫోలియోల్లో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన వెలువరించింది. దాని ప్రకారం.. ప్రస్తుతం మంత్రి మోపిదేవి వెంకటరమణ వద్ద ఉన్న మార్కెటింగ్ శాఖ, అదేవిధంగా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వద్ద ఉన్న ఆహారశుద్ధి శాఖలను.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం మంత్రి మోపిదేవి వద్ద పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉండగా.. బదలాయించిన శాఖ స్థానంలో మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్డెవలప్మెంట్ శాఖను ఆయనకు అప్పగించారు. తాజాగా ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను ఆయన వద్ద నుంచి బదలాయించారు.

ఇదిలా ఉంటే, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను వ్యతిరేకించడంపై కన్నబాబు టీడీపీపై మండిపడ్డారు. విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయంటున్నారు.. మరి ఇతర ప్రాంతాల్లో రావా? ముంబై, చెన్నై నగరాలు సముద్ర తీరం వద్దే ఉన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
ఎల్లో మీడియా అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇటీవలే భూకంపం వచ్చిందని.. మరి అలాంటిచోట చంద్రబాబు రాజధాని ఎందుకు పెట్టారని నిలదీశారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ఎనిమిది నెలల కిందటే చంద్రబాబును టీడీపీ పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారని విమర్శించారు.












Click it and Unblock the Notifications