ఏపీలో పాఠశాల విద్యలో మరో కీలక మార్పు: ఇక ప్రభుత్వ ప్రీ స్కూళ్లు: ప్రైవేటుకు ధీటుగా..
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను కొనసాగించడానికి సన్నాహాలను చేస్తోన్న జగన్ సర్కార్.. దానికి అనుగుణంగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల తరహాలోనే ప్రీ స్కూళ్లను నెలకొల్పబోతోంది. దీనిపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ప్రీస్కూళ్లు ఏర్పాటు కావడం దేశంలోనే ఇదే తొలిసారి రాష్ట్రం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రీస్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో సుమారు 15 వేల వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను కొనసాగించబోతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా పాఠశాలలన్నింట్లోనూ ఒకటవ తరగతి నుంచి విద్యాబోధన ఆరంభమౌతోంది. అయిదేళ్లు దాటిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటిదాకా ప్రీ స్కూళ్లు అనేవి లేవు. ఫలితంగా- పేద కుటుంబాల వారు తమ పిల్లలకు అయిదేళ్లు వచ్చేంత వరకూ పాఠశాలల్లో చేర్చట్లేదు. ఫలితంగా- నేరుగా ఒకటో తరగతిలోకి చేరడం, మున్ముందు ఇంగ్లీష్లో విద్యను అభ్యసించడం వంటి చర్యల వల్ల వారిపై ఒత్తిడి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పరిస్థితిని అధిగమించడానికి వీలుగా.. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రీస్కూళ్లను అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టిందని అంటున్నారు. ఈ ప్రీ స్కూళ్లలో ఇంగ్లీష్, తెలుగులో విద్యాబోధనను చేపడతారు. ప్రైవేటు ప్రీ స్కూళ్ల తరహాలోనే సిలబస్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఫలితంగా ఒకటో తరగతికి చేరుకునే సమయానికి విద్యార్థులు కొంత మెరుగవుతారని, వారిపై సిలబస్ భారం గానీ, ఒత్తిడి గానీ ఉండబోదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దిశగా త్వరలోనే ఓ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తుందని సమాచారం.
Recommended Video
తొలిదశలో ఎంపిక చేసిన గ్రామాల్లో 3,400 ప్రీ స్కూళ్లను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. గిరిజనులు, ఆదివాసీలు అధికంగా ఉండే గ్రామాల్లో తొలిదశలో వాటిని నెలకొల్పవచ్చని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని ఈ ప్రీస్కూళ్లు అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని తెలుస్తోంది. సర్వశిక్షా అభియాన్ కింద వాటిని నెలకొల్పుతారని, నాలుగు నుంచి అయిదేళ్ల లోపు వయస్సున్న పిల్లలను ఈ ప్రీస్కూళ్లలో అడ్మిషన్లు కల్పించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారులు చెబుతున్నారు.