కల్తీ మద్యంపై ప్రభుత్వం సీరియస్: తాత్కాలిక నిషేధం విధించిన 9 మద్యం బ్రాండ్లివే
అమరావతి: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా వ్వవహరిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. తాజాగా మంగళవారం ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.
సబ్ కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పరిశీలన చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తొమ్మిది మద్యం బ్రాండ్లపై మద్యం తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది.

ఆఫీసర్స్ ఛాయిస్ బ్యాచ్ 120, రాయల్ స్టాగ్ బ్యాచ్ 26, డైరెక్టర్స్ స్పెషల్ బ్యాచ్ 143, ఓఏబీ బ్యాచ్ 57, ఓల్డ్ టావెర్న్ బ్యాచ్ 77, మెక్ డోవెల్స్ విస్కీ బ్యాచ్ 9, మెక్ డోవెల్స్ బ్రాందీ బ్యాచ్ 232, ఇంపీరియల్ బ్లూ బ్యాచ్ 10, బ్యాగ్ పైపర్ మ్యదంపై తాత్కాలిక నిషేధం విధించింది.
అంతేకాదు, ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కృష్ణలంక ప్రాంత ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ నాయుడు, ఎక్సైజ్ కమిషనర్ మీనా పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
విచారణలో భాగంగా రెస్టారెంట్కు లైసెన్సు తీసుకొని సెల్లార్లో బార్ నడుపుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అధికారులు మాత్రం ఈ సెల్లార్ బార్కు గత ప్రభుత్వం అనుమతులిచ్చిందని తెలిపారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐపీసీ 304 ఏ, 328, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రానికి గాని, బుధవారం ఉదయానికి గాను ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రభుత్వం బెజవాడలోని వివిధ ఆసుపత్రుల్లో వారంతా చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications