అప్పట్లో బాధపడ్డా కానీ: స్మార్ట్సిటీలపై నారాయణ, చిచ్చు పెట్టింది బాబే: జగన్కు ఫిర్యాదు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు స్మార్ట్ సిటీలు రావడం మన అదృష్టమని మంత్రి నారాయణ గురువారం నాడు అన్నారు. అయిదేళ్లలో అబివృద్ధి చేసేలా దేశంలో వంద స్మార్ట్సిటీలు ఎంపిక చేసిన కేంద్రం ఏపీలో 3 నగరాలకే అవకాశమిచ్చిందని అప్పట్లో బాధపడ్డానని, ఇప్పుడు తొలి దశలో 2 ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
ఏపీలో మూడు స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా తొలి దశలో తిరుపతిని మినహాయించి విశాఖ, కాకినాడలను అభివృద్ధి చేయనున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించడం హర్షణీయమన్నారు. విశాఖలో 1,620 ఎకరాల్లో విస్తరించిన రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1,602 కోట్లతో అభివృద్ధి జరుగుతందన్నారు.
కాకినాడలో 1,375 ఎకరాలలో విస్తరించిన గాంధీ నగర్, రామారావుపేట, రామకృష్ణారావు పేట, సూర్యారావుపేట, ఎల్వీన్ పేట, మెయిన్ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్, పోర్టు, కచేరి నగర్, ఏటిమొగ, వెంకటేశ్వర కాలనీలను రూ.1,993 కోట్లతో అభివృద్ధి చేస్తారన్నారు.
వీటి అభివృద్ధికి కేంద్రం రూ.500, రాష్ట్రం రూ.500 కోట్లు కేటాయిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రయివేటు, పిపిపి పద్ధతిలో సమకూర్చుకోవాలసి ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రెండు స్మార్ట్ సిటీలతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మూడు నెలల్లో వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని సీఎం చెప్పారన్నారు.
మీ పోరాటానికి మా మద్దతు: మాలమహానాడు సంఘీభావం
ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ వైసిపి నేత జగన్ చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు ప్రకటించింది. మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య ఆద్వర్యంలో పలువురు నేతల గురువారం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడారు.
కలిసిమెలిసి ఉన్న ఎస్సీల మధ్య చిచ్చు పెట్టింది టిడిపి అధినేత చంద్రబాబేనని, ఆయన వల్ల ఏపీలో దళితలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే జగన్ నాయకత్వం అవసరమని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.