ఆనందయ్య కె మెడిసిన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: కంట్లో వేసే మందుపై నివేదికకు 2 వారాల గడువు
అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఇస్తున్న ఔషధాల్లో ఒకటైన కె మందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుతోపాటు కె మందుకు అనుమతివ్వలేదు.
Recommended Video
ఆయుష్ నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలు రాని నేపథ్యంలో వీటికి అనుమతి లభించలేదు. ఈ క్రమంలో విచారణ చేపట్టింది హైకోర్టు. కరోనా బాధితులకు తక్షణమే కె మందు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.
కాగా, ఆనందయ్య మందును సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు అందిస్తున్నారు. ఆ తర్వాత మిగితా జిల్లాల్లోని వారిక మందును అందిస్తామని ఆనందయ్య తెలిపారు. స్థానికేతరులు ఇప్పుడే ఇక్కడికి రావొద్దన్నారు.
ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు కూడా అనుమతించడంతో కంట్లో వేసే చుక్కల మందు మినహా మిగితా మందులను ప్రజలకు ఇవ్వనున్నారు. అయితే, కొన్ని ఆటంకాల వల్ల మందు పంపిణీ సవ్యంగా సాగడం లేదని ఆనందయ్య చెప్పారు.
పంపిణీకి వనరులు సమకూరడం లేదని, విద్యుత్ సౌకర్యం, మందు తయారీ యంత్ర సామాగ్రి లేదని ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి కానీ, ఇప్పటి వరకు సహకారం లేదన్నారు. ప్రభుత్వ సహకరిస్తే అన్ని ప్రాంతాలకు మందును పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.
కాగా, ఆన్లైన్ ద్వారా ఆనందయ్య మందు విక్రయంపై టీడీపీ, వైసీపీ నేతలపై మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆనందయ్య మందు ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కాకాని, వైసీపీ నేతలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ సహా పలువురు నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీకి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకాని. పేద ప్రజలకు అందించే మందుపై రాజకీయాలు చేయొద్దని టీడీపీకి ఆయన హితవు పలికారు. ఇప్పటికే సోమిరెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.